వైఎస్‌ మాట..విశ్వవిద్యాలయానికి బాట

17 Mar, 2019 11:24 IST|Sakshi
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌ : శ్రీకాకుళం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసానికి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 1980వ సంవత్సరం నుంచి  జిల్లా ప్రజలు ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అనేక కమిటీలు వేశాయి. అయినా విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదు. అయితే వైఎస్‌ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు 2008వ సంవత్సరం జూన్‌ 25న జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీని మంజూరు చేసి ఏర్పాటు చేశారు.

గార మండలం కళింగపట్నానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన  ఏయూ ప్రొఫెసర్‌ చోడిపల్లి వెంకట సుధాకర్‌ను తొలి వైస్‌చాన్స్‌లర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యలో కీలకంగా మారింది. వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, గణితం, జియోఫిజిక్స్, ఫిజిక్స్, జియాలజీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎంసీఏ, ఎఈడీ, యోగా డిప్లమో, ఎంఎల్‌ఐఎస్సీ, బీఈడీ మెంటల్లీ రి టార్డ్, బయోటెక్నాలజీ, తెలుగు, సోషల్‌ వర్క్, ఎల్‌ఎల్‌ఎం, ఇంగ్లీష్, రూరల్‌ డెవలప్‌మెంట్, ఎకనామిక్స్, ఎంకాం, ఎంజేఎంసీ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్‌ కోర్సులు ఉన్నాయి. కోర్సులు విస్తరిస్తూ విద్యార్థులకు విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంది. ప్రత్యేక దృష్టి పెడితే ఈ వర్సిటీ రాష్ట్రంలోనే ఉత్తమ వర్సిటీగా రూపొందే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు.  

విద్యా ప్రగతితోనే ప్రాంతీయ అభివృద్ధి
విద్యా ప్రగతితేనే ప్రాంతీయ అభివృద్థి సాధ్యమవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారు. అందుకే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం విద్యార్థులు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్లి చదువుకునేవారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని రానున్న ప్రభుత్వాలు ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన సంస్థగా తీర్చి దిద్దాలి.                                                      
 -మిర్యాల చంద్రయ్య,మాజీ ఇన్‌చార్జ్‌ వైస్‌చాన్సలర్

మరిన్ని వార్తలు