కోస్తాకు పిడుగులు.. జల్లులు

9 Mar, 2019 08:39 IST|Sakshi

రాయలసీమలో వేడిగాలులు

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులతో పోల్చుకుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికంగా రికార్డవుతున్నాయి. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతోంది. శనివారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది.

మరోవైపు రాయలసీమలో ఉష్ణతీవ్రత కొనసాగనుంది. శనివారం అక్కడ సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా తిరుపతితో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రెండు రోజులు వడగాడ్పుల ప్రభావం ఉండదని ఐఎండీ వివరించింది. గడచిన 24 గంటల్లో వేపాడ, నందిగామల్లో 3 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.

మరిన్ని వార్తలు