మరుగున పడ్డాయి..

6 Jan, 2015 02:27 IST|Sakshi
మరుగున పడ్డాయి..

మరుగుదొడ్లు లేక విద్యార్థుల ఇక్కట్లు           
జిల్లాలో 5,009 పాఠశాలలు
వెయ్యి పాఠశాలల్లో మరుగుదొడ్లు కరువు    
2,601 పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్లు లేవు
90 శాతం మరుగుదొడ్లకు నీళ్ల కరువు      
కొన్నింటికి తాళాలు, మిగిలినవి శిథిలావస్థకు..

 
నారు పోసినోడు.. నీరు పోయకమానడు అన్న పెద్దలమాట విన్న విద్యార్థులు మరుగుదొడ్లు కట్టించారు కదా.. నీటి వసతి కల్పిస్తారులే అనుకుంటే, అధికారులు మొండిచే రుు చూపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారారుు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ‘నీటి’మూటలుగా మిగలడంతో విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు నోట మాట రాక, ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్నారు.
 
చిత్తూరు  జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బాలికల అవస్థలు అన్నీ ఇన్ని కావు. వారిది చెప్పుకోలేని బాధ. జిల్లాలో 5,009 పాఠశాలుండగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 2,601 పాఠశాలల్లో బాలురకు ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు.  పేరుకు 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటివసతి లేక నిరుపయోగంగా మారాయి. పాఠశాలలకు నీటి వసతి కల్పిం చాల్సిన బాధ్యత  ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలదేనని అధికారులు చెబుతున్నా అమలు కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లకు తాళాలు వేయగా, మిగిలినవి పిచ్చి మొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరి పనికి రాకుండా పోయాయి. మరికొన్నింటిని తొలగించి పాఠశాల అదనపు గదులను నిర్మించారు.  విద్యార్థులు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది.  ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చి ంచి పేరుకు మరుగుదొడ్లు నిర్మించినా వాటికి నీటివసతి కల్పించి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. 

ఈ ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం రూ.1.09 కోట్లు మంజూరు చేసిందని, జిల్లాలో జూన్ నుంచి స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టామని, పాఠశాలల మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయని సర్వశిక్షా అభియాన్ పీవో లక్ష్మీ చెప్పడం గమనార్హం. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేసిందని తనకు తెలియదని ఎస్‌ఎస్‌ఏ ఇంజినీర్‌ను అడగాలంటూ సమాధానమిచ్చారు. తాను కొత్తగా వచ్చానని, నిధుల ఖర్చుల విషయం తనకు తెలియదని ఇంజినీర్ రవీం ద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
 తంబళ్లపల్లె నియోజకవర్గపరిధిలో 390 పాఠశాలలు ఉన్నాయి. నీటి సౌకర్యం లేక 80 శాతం  మరుగుదొడ్లు మూతపడ్డాయి. నియోజకవర ్గవ్యాప్తంగా కేవలం 15 పాఠశాలలకు  మాత్రమే నీటి సౌకర్యం ఉంది. కొన్ని మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
 చంద్రగిరి నియోజకవర్గంలో 325 పాఠశాలలు ఉన్నాయి. 95 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు నిర్మించినా నీరు లేక నిరుపయోగంగా మారాయి. బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయట, సమీపంలోని పొలాల్లో కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది.  
 జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 455 పాఠశాలలు ఉన్నారుు. నిబంధనల మేరకు కనీ సం 40 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మిం చాల్సి ఉంది. పెనుమూరు పాఠశాలలో 600 మంది విద్యార్థులకు 15 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలో 90 శాతం మరుగుదొడ్లకు నీటి వసతి లేదు.

పలమనేరు నియోజకవర్గంలో ఐదు మం డలాల పరిధిలో 501 పాఠశాలలుండగా, 42.441 విద్యార్థులు ఉన్నారు. 410 పాఠశాలల్లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరాయి. కొన్ని హైస్కూళ్లల్లో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు.

పూతలపట్టు నియోజకవర్గంలో 390 పాఠశాలలు ఉన్నాయి. 95 పాఠశాలల పరిధి లో మరుగుదొడ్లకు నీటి వసతి లేదు. కొన్నింటికి తాళాలు వేశారు. మరికొన్ని డోర్లు పాడైపోయి శిథిలావస్థకు చేరాయి.

సత్యవేడు నియోజకవర్గంలో 413 పాఠశాలలు ఉన్నాయి. 118 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. 112 పాఠశాలల్లోని మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు.

పుంగనూరు నియోజకవర్గంలో 362 పాఠశాలలు ఉన్నాయి. 41 పాఠశాల్లో మాత్రమే నీటి వసతి ఉంది. మిగిలిన పాఠశాలల్లో మరుగుదొడ్లునిరుపయోగంగా మారాయి.

పుత్తూరు నియోజకవర్గంలో 307 పాఠశాలలు ఉన్నాయి. 32 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మిగిలిన పాఠశాలల్లో 90 శాతం వాటికి నీటి సౌకర్యం లేదు.

 శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 349 పాఠశాలలు ఉన్నాయి. 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. 60 శా తం పాఠశాలల పరిధిలో నీటివసతి లేక మరుగుదొడ్లునిరుపయోగంగా మారాయి.

కుప్పం నియోజకవర్గ పరిధిలో 475 పాఠశాలలు ఉన్నాయి. 80 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించారు. నీటి వసతి కల్పించలేదు. నీటి వసతి కల్పించే బాధ్య త సర్పంచులదేనని జిల్లా అధికారులు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. మదనపల్లె నియోజకవర్గపరిధిలో  215 పాఠశాలల్లో 30,200 మంది విద్యార్థులు ఉన్నారు. 95 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. 70 శాతం వాటిలో నీటివసతి లేదు. కొన్ని మరుగుదొడ్లు పిచ్చిమొక్కలుమొలిచి పనికి రాకుండా పోయాయి  చిత్తూరు నియోజకవర్గపరిధిలో  215 పాఠశాలున్నాయి. వీటిల్లో 11,699 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. చిత్తూ రు రూరల్, అర్బన్, గుడిపాల పరిధిలో 78 పాఠశాలల్లో నీటి సౌకర్యం లేదు.
 
 

మరిన్ని వార్తలు