మృత్యు వేగం

16 Mar, 2016 00:54 IST|Sakshi
మృత్యు వేగం

మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం
గొల్లపూడి శివారులో ఘోర ప్రమాదం
మృతుల కుటుంబాల్లో తీరని విషాదం
ట్రావెల్స్ నిర్లక్ష్యమూ ఘటనకు కారణం
 

మద్యం మత్తు.. ఆపై మితి మీరిన వేగం.. పైగా విద్యార్థులతో ఘర్షణ... వెరసి నలుగురు వైద్య విద్యార్థుల విలువైన జీవితాలను డ్రైవర్ చిదిమేశాడు. ఇదే ప్రమాదంలో తాను కూడా మరణించి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాడు. అప్పటికే అతడు మద్యం తాగి ఉన్నట్లు పసిగట్టిన విద్యార్థులు బస్సును వేగంగా నడపవద్దంటూ పదేపదే చెప్పినా వారి మాటల్ని ఖాతరుచేయలేదు. ఇదే విషయాన్ని ట్రావెల్స్ యాజమాన్యానికి చెబితే వారు కూడా స్పందించలేదు. ఫలి తంగా  ఈ ఘోరం జరిగింది.. ఆయా కుటుంబాల్లో విషా దాన్ని నింపింది.   
 
విజయవాడ సిటీ/భవానీపురం : గుంటూరుకు చెందిన వేముల శివశంకర్ హైదరాబాద్‌లో ఉంటూ ధనుంజయ్ ట్రావెల్స్‌లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. పదేళ్లుగా ఇదే సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన మెడికో అంతర్ కళాశాలల స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 46 మంది వైద్య విద్యార్థులు సోమవారం ఉదయం ధనుంజయ్ ట్రావెల్స్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో బయలుదేరేందుకు సిద్ధమవగా.. కొందరి విద్యార్థుల నగదు, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు కనిపించలేదు. డ్రైవర్‌ను గట్టిగా నిలదీయగా తెలియదని బుకాయించాడు. క్లీనర్ కోసం ప్రయత్నిస్తే కనిపించలేదు. ఎట్టకేలకు క్లీనర్ మొబైల్ నంబర్‌ను గుర్తించి ఫోన్ చేశారు. తర్జనభర్జనలు జరిగాక విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్దకు వస్తే తీసుకున్న వస్తువులు తిరిగిచ్చేస్తానంటూ క్లీనర్ చెప్పాడు. ఆ మేరకు అదే బస్సులో వీరు విజయవాడ చేరుకుని పాత బస్టాండ్ సమీపంలో కొద్దిసేపు వేచి ఉన్నారు. క్లీనర్ వచ్చిన తర్వాత సామగ్రి తీసుకుని తమతోపాటు బస్సులో ఎక్కించారు. ఇదే సమయంలో ట్రావెల్స్ నిర్వహకులకు సమాచారం ఇచ్చి డ్రైవర్‌ను మార్చాలని చెప్పగా తగిన సమాధానం రాకపోవడంతో ఆ బస్సులో వెళ్లేందుకు విద్యార్థులు సుముఖత చూపలేదు. 

ఇదే సమయంలో  డ్రైవర్ సూచనల మేరకే వాటిని తాను దొంగిలించినట్టు క్లీనర్ తెలిపాడు. విద్యార్థుల ప్రమేయం లేకుండానే బస్సును నడుపుతుండడంపై పలువురు విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వీరి మాటలను ఖాతరు చేయకుండా బస్సును నడుపుతున్నాడు. నగర శివారుకు వెళ్లిన తర్వాత డ్రైవర్ వాలకంతో బెంబేలెత్తిన కొందరు విద్యార్థులు వెళ్లి బస్సు ఆపాలని అరిచారు. ఓ వైపు వీరితో వాదిస్తూనే బస్సును మరింత వేగంగా శివశంకర్ నడిపాడు. నల్లకుంట సమీపంలో బస్సు ఒక్కసారిగా బస్సు డివైడర్‌ను ఢీకొంది. అక్కడ రోడ్డు కొద్దిమేర ఎడమ వైపు మలుపు ఉంటుంది. ఇది గమనించక నేరుగా వెళ్లి డివైడర్‌ను కొట్టి కంగారుపడి వేగంగా ఎడమ వైపు  స్టీరింగ్ తిప్పాడు. బస్సు వేగంగా వెళ్లడం, పవర్ స్టీరింగ్ కావడంతో రోడ్డు మార్జిన్‌లో ఉన్న చెట్టును బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయి తిరగబడింది. డ్రైవర్‌తో పాటు నలుగురు విద్యార్థులు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా, 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
 
ట్రావెల్స్ నిర్లక్ష్యం..
 ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సామగ్రి చోరీతో పాటు డ్రైవర్ ప్రవర్తనపై సాయంత్రమే విద్యార్థులు ట్రావెల్స్ యాజమాన్యం దృష్టికి  తీసుకెళ్లారు. పదే పదే సమాచారం ఇచ్చినా వారు సక్రమంగా స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పైగా గట్టిగా నిలదీస్తే సూర్యాపేటలో డ్రైవర్‌ను మార్చుతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. విద్యార్థుల సమాచారంపై యాజమాన్యం స్పందించినట్టయితే విజయవాడలోనే ఆగిపోయేవారు. మరో డ్రైవరు వచ్చేవరకు వేచి చూసే వాళ్లమని విద్యార్థులు చెబుతున్నారు. గతంలో కూడా ధనుంజయ్ ట్రావెల్స్ నిర్వాహకులపై పలు ఆరోపణలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. హైదరాబాద్ నల్లకుంట ప్రధాన కార్యాలయంగా దూర ప్రాంత బస్సులకు ఓల్వో బస్సులను వీరు నడుపుతుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి దీపక్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మాట్లాడుకున్న విద్యార్థులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు చేరడానికి ధనుంజయ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు.
 
 

>
మరిన్ని వార్తలు