డబ్లింగ్‌ లైన్‌పై ట్రయల్‌రన్‌

5 Aug, 2019 10:29 IST|Sakshi
ఆకివీడులో డబ్లింగ్‌ రైల్వే లైన్‌ ఎక్కుతున్న నర్సాపురం–నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌

సాక్షి, పశ్చిమగోదావరి : ఆకివీడు డబ్లింగ్‌ రైల్వే లైన్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ఆదివారం ప్రయోగాత్మకంగా రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాం వద్ద నిర్మించిన డబ్లింగ్‌ లైన్‌పై నాగర్‌సోల్‌–నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌ను నడిపించారు. సుమారు అర కిలోమీటరు మేర ఈ లైన్‌ నిర్మాణం పూర్తికావడంతో పామర్రు–ఆకివీడు వరకూ డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. జంక్షన్‌లు, సిగ్నల్స్, క్రాసింగ్‌ వంటి మైనర్‌ పనుల్ని పది రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 12 నాటికి డబ్లింగ్‌ లైన్‌ పనులు పూర్తి చేస్తారు. ఆగస్టు 15 నుంచి పామర్రు నుంచి ఆకివీడు వరకూ డబుల్‌ లైన్‌లో రైళ్ల రాకపోకల్ని ప్రారంభిస్తారు. గత పదిహేను రోజులుగా ఆకివీడులోని ఒకటో ప్లాట్‌ఫాం తొలగించి, ఆ ప్రదేశంలో డబ్లింగ్‌ లైన్‌ నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తి చేశారు. మొదటి ప్లాట్‌ ఫాం నిర్మాణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. నర్సాపురం–విజయవాడ, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం–నిడదవోలుల మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు కొనసాగుతుండగా, 2022 నాటికి ఆ లైన్లను ప్రారంభించాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు.


 

మరిన్ని వార్తలు