వైద్యం కాదు..సొంత పైత్యం

25 Jan, 2014 00:15 IST|Sakshi
వైద్యం కాదు..సొంత పైత్యం

 రావులపాలెం, న్యూస్‌లైన్ :
 ‘మీకే సమస్యా లేదు. మీకు పిల్లలు పుడతారు’.. ఇది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి వారి ‘భరోసా’. ‘మీ ఊపిరితిత్తులు బాగోలేవు. భవిష్యత్తులో మీకు సమస్య తప్పదు’.. ఇది ఉత్తుత్తి పరీక్ష చేసి మరో వ్యక్తికి హెచ్చరిక. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. చాలామందికి వైద్యం పేరుతో వారు నోటికొచ్చినట్లు చెప్పారు. రిపోర్టులు,  మందులు అంటూ ‘సొంత పైత్యం’ ప్రదర్శించారు. ఇక్కడ పరీక్షలు చేయించుకున్న కొంతమందికి అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించడంతో నకిలీ వైద్యం బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని వేమనరెడ్డి కల్చరల్ అసోసియేషన్ కల్యాణ మండపంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బోడ్డెపు గణేష్ రెడ్డి అనే వ్యక్తి నామమాత్రపు ఖర్చులతో వైద్య శిబిరం నిర్వహిస్తామనడంతో కల్యాణ మండపం నిర్వాహకులు అనుమతి ఇచ్చారు.
 
 ఆయుర్వేదంలో తాము కనిపెట్టిన కొత్త విధానంలో అన్ని రోగాలకు పరీక్షలు చేసి, మందులు ఇస్తామంటూ ప్రచారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భలే వెంకట్రావు, గణేష్‌రెడ్డి, పల్లా ప్రసాద్, గంధం గౌతమ్, బోడ్డెపు కరుణాకర్, అన్నవరపు కుమార్, షేక్ బాబా, పెద్దపాటి గౌరీ గత ఐదు రోజులుగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రూ.500కే ఫుల్ బాడీ స్కానింగ్ చేసి, ఇప్పుడున్న, మున్ముందు రాబోయే రోగాలు తెలుపుతామంటూ నమ్మబలికారు. 36 అవయవాలకు సంబంధించిన పరీక్షల రిపోర్ట్ 24 పేజీల్లో వెంటనే ఇస్తామని శిబిరం నిర్వాహకులు చెప్పారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన వారు నాలుగు రోజులుగా పరీక్షలు చేయించుకున్నారు. ల్యాప్‌టాప్ కంప్యూటర్‌తో అనుసంధానం చేసిన ఓ పరికరాన్ని చేతికి ఇచ్చి పట్టుకోమనడం మాత్రమే వాళ్లు చేసే పరీక్ష. ఆ తర్వాత రిపోర్టు ఇచ్చేవారు. మందులకు రూ.5 వేల నుంచి రూ.8 వేలు అవుతాయని నిర్వాహకులు చెప్పడంతో కొందరు తీసుకున్నారు. మరికొందరు రిపోర్టులతో స్థానికులు సమీప ఆస్పత్రులకు వెళ్లారు.
 
  ఆ రిపోర్టులు సరికావని వైద్యులు చెప్పడంతో కంగుతిన్నారు. శుక్రవారం బాధితులు పెద్దఎత్తున శిబిరం వద్దకు చేరుకుని నిర్వాహకులను నిలదీశారు. తామిచ్చిన రిపోర్టు తమకే పనిచేస్తుందని, తమది ఇంగ్లిష్ వైద్యం కాదని, న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే ఇస్తున్నామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ‘అసలు మీరు వైద్యులేనా, గుర్తింపు పత్రాలు చూపండి’ అంటూ నిలదీశారు. దీంతో నిర్వాహకులు ఓ సమావేశం నిర్వహించి, బాధితులను బుజ్జగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో బాధితులు వారితో వాగ్వాదానికి దిగారు.
 
 కల్యాణ మండపం నిర్వాహకులు పడాల పెదవెంకటరెడ్డి, పోతంశెట్టి కనికిరెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని, వైద్య శిబిరం పేరుతో ఇదేం నిర్వాకమంటూ నిలదీశారు. రావులపాలెం ఎస్సై ఆర్.గోవిందరాజు అక్కడికి చేరుకుని, శిబిరం నిర్వాహకులను అనుమతులు, గుర్తింపు పత్రాలు చూపాలని కోరారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. ల్యాప్‌టాప్, స్కానర్, సబ్బులు, టానిక్‌లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజులుగా సుమారు 750 మంది నుంచి రూ.500 చొప్పున, మందుల పేరుతో మరో రూ.50 వేల వరకు వసూలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు