ఈ–కేవైసీ నమోదుకు గడువు పెంపు

23 Aug, 2019 12:18 IST|Sakshi
ఏలూరులోని ఆధార్‌ నమోదు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఈ–కేవైసీ నమోదు చేయించుకోవాలన్ననిబంధనపై ప్రతిపక్షాలు, మీడియా తప్పుడు ప్రచారానికి దిగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడువు అయిపొతుందన్న పుకార్లతో ఆధార్‌ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే 15 ఏళ్లు దాటిన వారికి వచ్చేనెల ఐదు వరకూ, 15ఏళ్ల లోపు పిల్లలకు వచ్చేనెల 15 వరకూ గడువు ఉందని ప్రభుత్వం ప్రకటించింది.

సాక్షి, తూర్పుగోదావరి(ఏలూరు) : ఈ–కేవైసీ అనేది ఆయా రేషన్‌ షాపుల్లో డీలర్ల వద్ద వేలిముద్ర ద్వారా చేసుకునే కార్యక్రమం మాత్రమే. ఇంటింటికీ రేషన్‌ సరఫరా సమయంలో ఆయా కుటుంబాల్లో వేలిముద్రలు లేనివారు ఉంటే వారికి ఇబ్బందులు తలెత్తుతాయని, కుటుంబ యజమాని వచ్చేంత వరకూ వేచి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆ రేషన్‌ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. 

రేషన్‌ షాపుల వద్దే ఈ–కేవైసీ
మన జిల్లా విషయానికి వస్తే నాలుగు లక్షల 85 వేల మంది ఈ–కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది.  ఆయా రేషన్‌ షాపుల వద్దే ఈపాస్‌ మిషన్‌ ద్వారా దీన్ని నమోదు చేసుకుంటే సరిపోతుంది.   ఈ–కేవైసీ లేకపోయినా ఎవరి రేషన్‌ కట్‌ చేయడం జరగదు. అయితే కొత్త  రేషన్‌ కార్డు కావాలన్నా, డ్వాక్రా గ్రూపు సభ్యులుగా నమోదు అవ్వాలన్నా, అమ్మ ఒడి, పింఛన్లు, ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా ఈ–కేవైసీతోపాటు ప్రజాసాధికార సర్వేలో నమోదు కావాలని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు పనులు మానుకుని, పిల్లలను స్కూల్‌ ఎగ్గొట్టించి మరీ మీ సేవ, ఆధార్‌ కేంద్రాలకు తిప్పుతున్నారు.  జిల్లా వ్యాప్తంగా గతంలో నిర్వహించిన సాధికార సర్వేలో నమోదు కానివారు ఇంకా 1.75 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరందరి దగ్గరకు ఆయా గ్రామాలు, పట్టణాల్లోని సర్వే బృందం వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుంది.

ఇలా నమోదు చేసుకోవచ్చు..
ఆధార్‌ కార్డు ఉండి బయోమెట్రిక్‌ లేదా  ఓటీపీ ఆధారంగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఈకేవైసీ నమోదు సమయంలో 101 ఎర్రర్‌ అని వస్తే వారు తప్పని సరిగా ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి తమ వేలిముద్రలు అప్‌డేట్‌ చేసుకోవాలి. రేషన్‌ షాపులో ప్రతినెలా  వేలి ముద్రలు వేసి రేషన్‌ తీసుకునే వారు వివిధ, పింఛన్లు పథకాల్లో బయోమెట్రిక్‌ పడే వాళ్ళకు ఈ–కేవైసీ వెంటనే పూర్తవుతుంది. ప్రస్తుతం రేషన్‌ డీలర్లకు డిపో పరిధిలో ఉన్న కార్డుదారులలో ఈకేవైసీ నమోదు చేసుకోని వారి పేర్ల జాబితాను డీలర్లకు ఇచ్చారు. ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వాళ్ళు ముందుగా వెళ్లి రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి వేలి ముద్రను వేసి ఈ–కేవైసీని ఉచితంగా చేసుకోవచ్చు.

అయితే డీలర్లు ఈకేవైసీ చేయకుండా అందరినీ ఆధార్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు పంపుతుండటంతో సమస్య మొదలైంది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని ఆధార్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు తిప్పుకుంటున్నారు. ఆధార్‌ సెంట ర్‌లో ఆధార్‌ నమోదుకు రూ.50, ఈకేవైసీ నమోదుకు రూ.15 చెల్లిస్తే సరి. అయితే ప్రజల నుంచి నిర్వాహ కులు భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 8,913 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్‌ కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  

మరిన్ని వార్తలు