ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగు మాట్లాడే వారు ఇక అధికారికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా వేరయ్యారు. కాగా సంయుక్త ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ కొత్త రాష్ట్రాలకు తొలి గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ గవర్నర్గా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి కావడమిక లాంఛనమే. ఇలా నరసింహన్ హయాంలో విభిన్న పార్టీల ప్రభుత్వాలు ఏర్పడం.. నలుగురు ముఖ్యమంత్రులు పనిచేయడం మరో విశేషం.
2007లో ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన నరసింహన్.. 2009 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ (మునుపటి) గవర్నర్ ఎన్ డీ తివారీ రాజీనామా చేయడంతో ఇక్కడకు బదిలీ అయ్యారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, రాష్ట్రపతి పాలన వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సమర్ధంగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి పదవికి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా పరిపాలన స్తంభించకుండా చురుగ్గా వ్యవహరించారు. పెట్రోలు బంకుల డీలర్లు సమ్మె చేసినప్పుడు ఆయన కలగజేసుకున్న గంటలోపే వాళ్లు సమ్మె విరమించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కీలకంగా పనిచేశారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడే నరసింహన్ 1946లో తమిళనాడులో జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్ర్రంలో డిగ్రీ, పొలిటికల్ సైన్స్లో పీజీ, లా చేశారు. అనంతరం ఇండియన్ పోలీస్ సర్వీస్కు ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారిగా పనిచేశారు. ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్గా సుదీర్ఘకాలం బాధ్యతలు చేపట్టారు.
నరసింహన్ ప్రొఫైల్:
వయసు: 71
స్వరాష్ట్రం: తమిళనాడు
విద్యాభ్యాసం: ఫిజిక్స్లో డిగ్రీ, పొలిటికల్ సైన్స్లో పీజీ, లా
ఐపీఎస్కు ఎంపిక: 1968 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కేడర్
1981-84: మాస్కో ఎంబసీలో తొలి సెక్రటరీ
2006 వరకు: ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పదవీ విరమణ
2007 జనవరి 19: చత్తీస్గఢ్ గవర్నర్గా నియామకం
2009 డిసెంబర్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు
2014 జూన్ 2: తెలంగాణ తొలి గవర్నర్గా ప్రమాణం (అదనపు బాధ్యతలు)