రాజ్యసభ ఎన్నికలపై ఈసీ నిఘా!

10 Feb, 2018 01:23 IST|Sakshi
రావత్‌కు వినతిపత్రమిస్తున్న ఎంపీ

ఈసీకి వైఎస్సార్‌ సీపీ వినతి

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు అధికార టీడీపీ కుట్రలు పన్నుతోందని, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేస్తోందని వైఎస్సార్‌ సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీన్ని అడ్డుకునేందుకు రాజ్యసభ ఎన్నికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేసి పరిశీలకులను పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఒ.పి.రావత్‌ను వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో ఒ.పి.రావత్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్‌లో నిర్వహించండి 
వైఎస్సార్‌ సీపీ టికెట్‌పై గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే కొనుగోలు చేసిన అధికార టీడీపీ.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో నెగ్గేందుకు మరో నలుగురిని కొనుగోలు చేసేందుకు బేరసారాలు చేస్తోందని విజయసాయిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్ల వరకు ఆఫర్‌ చేస్తున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రలోభాలు, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునేందు కు రాజ్యసభ ఎన్నికలను అమరావతిలో కాకుండా రాష్ట్ర విభజన చట్ట ప్రకారం 2024 వరకు ఎన్నికలు నిర్వహించేం దుకు అధికారం ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో చేపట్టాలని కోరారు. 

మా ఎమ్మెల్యేల అరెస్టుకు కుట్ర 
రాజ్యసభ ఎన్నికల్లో విపక్ష ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోకుండా తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని విజయసాయిరెడ్డి ఈసీ దృష్టికి తెచ్చారు. రాజ్యసభ ఎన్నికల తేదీకి పది రోజులు ముందు నుంచి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను ఎలాంటి అరెస్టులు చేయకుండా ఏపీ పోలీసులను ఆదేశిం చాలని కోరారు. పరిశీలకులను పంపి ఎన్నికల తీరుపై ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఈసీకి  వివరాలు అందేలా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాము చేసిన విజ్ఞప్తులపై రావత్‌ సాను కూలంగా స్పందించినట్టు తెలిపారు. చట్టం అనుమతించే అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  

మరిన్ని వార్తలు