ఏపీ కాబినెట్ నిర్వహణపై వీడిన ఉత్కంఠ 

13 May, 2019 19:12 IST|Sakshi

ఏపీ కేబినెట్‌ భేటీకి ఈసీ షరతులతో కూడిన అనుమతి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. మంగళవారం మంత్రివర్గం నిర్వహణకు సీఈసీ షరతులతో కూడిన అనుమతిచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. కాగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో మంత్రి వ‌ర్గ ఎజెండాకు ఎన్నిక‌ల సంఘం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను ప‌రిశీలించిన సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ క‌మిటీ ఆమోదముద్ర వేసింది. స్క్రీనింగ్ కమిటీ అమోదించిన  అజెండా నోట్‌ను ఈనెల  10 తేదీ సాయంత్రం రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి ద్వారా సీఈసీకి పంపారు. ప్రతిపాదిత అజెండా తో పాటు క్యాబినెట్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి కోరుతూ ప్ర‌భుత్వం తరపున విజ్ఞ‌ప్తిని పంపారు. 

క్యాబినెట్‌ నిర్వహించుకోవచ్చని ఈసీ అనుమతి ఇవ్వడంతో రేపు ఉదయం ముఖ్యశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. మంచినీరు, సాగునీరు, ఫొని తుఫాను, కరువు అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. అయితే కొత్త నిర్ణయాలకు, రేట్ల మార్పుకు, బకాయిల చెల్లింపులకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఈసీ అనుమతి తర్వాత అమలు చేయాలని పేర్కొంది. అంతేకాకుండా కేబినెట్‌ నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు క్యాబినెట్‌ సమావేశం
రేపు మధ్యాహ్నం 2.30కి కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నాలుగు శాఖల అధికారులకు నోట్‌ పంపించారు. అలాగే క్యాబినెట్‌ మంత్రులకు బ్రీఫ్‌ చేసేందుకు నాలుగు శాఖల సెక్రటరీలు హాజరు కావాలని సీఎస్‌ ఆదేశించారు. పంచాయతీరాజ్‌, విపత్తుల నిర్వహణ, వ్యవసాయ, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : 
ఏపీ కాబినెట్ నిర్వహణకు ఈసీ అనుమతి

మరిన్ని వార్తలు