సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఏపీలో మూడు స్థానాలకు, తెలంగాణలో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న నామినేషన్లను పరిశీలిస్తారు. 19 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. 28న ఎన్నికల షెడ్యూల్ ముగుస్తుంది. ఏపీలో కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), వీరభద్రస్వామి ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజీనామా చేశారు. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఉప ఎన్నికలు జరగనున్నాయి.