మధ్యాహ్నం..గుడ్డు మాయం!

3 Nov, 2018 13:20 IST|Sakshi
జూపాడుబంగ్లా మోడల్‌ పాఠశాలలో గుడ్డులేకుండా మధ్యాహ్నభోజనం వడ్డింపు,

చేతులెత్తేసిన మధ్యాహ్నభోజన నిర్వాహకులు  

నాలుగు నెలలుగా అందని బిల్లులు  

అప్పులు చేస్తున్న నిర్వాహకులు  

పట్టించుకోని ప్రభుత్వం

కర్నూలు, జూపాడుబంగ్లా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు వారానికి ఐదు గుడ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యాహ్నభోజన నిర్వాహకులు దానిని ఇవ్వకుండా చేతులెత్తేశారు. జిల్లా వ్యాప్తంగా 2,947 పాఠశాలలు ఉండా ప్రాథమిక పాఠశాలల్లో 2,00,759 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,10,698 మంది, ఉన్నత పాఠశాలల్లో 54,076 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు వడ్డించే గుడ్డు 47 గ్రాముల నుంచి 52 గ్రాముల మధ్య ఉండాల్సి ఉంటుంది. ఒక్కో దానికి ప్రభుత్వం రూ.4.68ల చొప్పున చెల్లిస్తుంది. ఈ లెక్కన రోజుకు రూ.18,86,040ల మొత్తాన్ని వెచ్చిస్తున్నారు.

ఏడాది క్రితం మధ్యాహ్నభోజనం తోపాటు వారానికి రెండు పర్యాయాలు భోజన నిర్వాహకులే గుడ్డును వడ్డించేవారు. వారు సక్రమంగా వడ్డించటం లేదని పేర్కొంటూ వీటిని సరఫరాను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే కాంట్రాక్టర్‌ నాసిరకమైనవి, తక్కువ బరువున్న వాటిని సరఫరా చేస్తుంటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు పక్షం రోజుల క్రితం కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,947 పాఠశాలల్లోని 4.03లక్షల మంది విద్యార్థులకు పక్షం రోజుల నుంచి మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇవ్వటం లేదు. నెలకోపర్యాయం బిల్లులు చెల్లిస్తే  గుడ్డును వడ్డిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోతే సాధ్యం కాదని చెబుతున్నారు.   

జిల్లా అధికారుల ఆదేశాలు వెల్లడించాం
జిల్లా అధికారులు వెల్లడించిన ఆదేశాలను మధ్యాహ్నభోజన నిర్వాహకులకు తెలియజేశాం.   నిర్వాహకులకు బిల్లులు రావాల్సిన మాట వాస్తవమే. వాస్తవానికి వారానికి ఐదు గుడ్లు పెట్టడం నిర్వాహకులకు కష్టసాధ్యమవుతుంది. నెల నెలా బిల్లులు ఇస్తామని జిల్లా అధికారులు పేర్కొన్నారు. నిర్వాహకుల అభిప్రాయాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.   – శ్రీనివాసులు, ఎంఈఓ, జూపాడుబంగ్లాజూపాడుబంగ్లా మోడల్‌ పాఠశాలలో గుడ్డులేకుండా మధ్యాహ్నభోజనం వడ్డింపు,

మరిన్ని వార్తలు