ఈ ఏడాదీ జిల్లాలో తాగునీటి ఎద్దడి తప్పేలా లేదు. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ప్రజల పాలిట శాపంగా మారనుంది. రానున్న వేసవిలో సైతం నీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించేలావుంది.
సాక్షి, గుంటూరు :
జిల్లాలో తాగునీటి పనులకు గ్రహణం పట్టింది. ఈ ఏడాది మార్చిలో నిధులు మంజూరైనప్పటికీ ఎన్నికల కోడ్, రాష్ట్ర విభజనకు తోడు జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంతో పనులు టెండర్ల దశలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కోట్లాది రూపాయల మంచినీటి పనులు అటకెక్కె పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో మొత్తం 1699 నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో శాశ్వత తాగు నీటి సమస్య పరిష్కారం కోసం 726 నివాస ప్రాంతాల్లో ఎన్ఆర్డీడబ్ల్యుపీ (నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం)కింద జిల్లా వ్యాప్తంగా రూ.272.81 కోట్ల విలువైన 307 పనులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇందులో ప్రారంభించని దాదాపు రూ.150 కోట్లకు పైగా విలువైన190 పనులను ఇటీవలే ప్రభుత్వం నిలిపి వేయాలని ఆదేశించింది.
జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి పనులు ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఆ నిధులతో పనులు చేసుకోనే వెసులుబాటు ఉండేది.
సమస్యాత్మక ప్రాంతాల్లో పనులు ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయక పోతే వేసవి కాలంలో మాత్రం తాగునీటి ఇక్కట్లు తప్పవు. మంచి నీటి ట్యాంకర్లలను ఆశ్రయించక తప్పదు.
ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా కోసం ఈ పథకం ద్వారా పైపులైను నిర్మాణాలు, రక్షిత, సమగ్ర మంచినీటి పథకాల పనులు చేపడతారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 363 చెరువుల్లో అవసరమైన పనులు చేపడతారు.
త్వరలో నిర్ణయం...
ఎన్ఆర్డీడబ్ల్యుపీ కింద ప్రారంభించకుండా ఉన్న పనులను ప్రభుత్వం నిలిపివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరిపిన అనంతరం పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వనుంది. త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
- ఆర్.వేణు ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ, గుంటూరు.
జిల్లాలో ఎన్ఆర్డీడబ్ల్యుపీ కింద మంజూరైన పనులు
పథకం పేరు అంచనా విలువ మంజూరైనపనులు అవాసాలు ప్రారంభంకాని
(రూ.కోట్లలో) పనులు ప్రాజెక్టులు 203.08 27 446 14
నార్మల్ ప్రోగ్రాం 67.65 250 250 158
ఇందిరమ్మ కాలనీలు 2.08 30 30 18