రేషన్‌షాపుల దగ్గరే ఈకేవైసీ నమోదు

25 Aug, 2019 12:47 IST|Sakshi

ఐదేళ్లలోపు పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదు

ఈకేవైసీ నమోదు కాకపోతే రేషన్‌ అవ్వరన్నది అపోహ

బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసులతో పనిలేదు

సాక్షి, అమరావతి: రేషన్‌షాపుల దగ్గరే ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేవైసీ కోసం మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పని లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాళ్లకు రేషన్‌ దుకాణం దగ్గరే ఈ కేవైసీ నమోదు చేస్తారు. ఐదేళ్లలోపు వయసున్న  పిల్లలకు ఈకేవైసీ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 15 ఏళ్ల లోపు వయసున్న వారు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఈ కేవైసీ నమోదు కాకపోతే రేషన్‌ అవ్వరన్నది కేవలం అపోహ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రత్యేక బృందాలను పంపిస్తుంది..
మరోవైపు ఆధార్‌ మరియు కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురైన ఘటనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆధార్ అప్‌డేట్‌కోసం ప్రజలెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరంలేదని అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వాటిని అప్‌డేట్‌ చేయించుకోవచ్చుని, దానికి ప్రత్యేకంగా ఎటువంటి గడువు లేదని  ఆయన స్పష్టం చేశారు.ఆధార్‌ నమోదు వ్యవహారం ప్రహసనంలా మారిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఓ  ప్రకటన విడుదల చేశారు. ‘స్కూలు పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదు. రానున్న రోజుల్లో స్కూలు పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుంది. అక్కడే ఆధార్ వివరాలు అప్‌డేట్‌ చేయించుకోవచ్చు. ఈకేవైసీ అప్‌డేట్‌ చేయనంత మాత్రాన రేషన్ సరుకులను తిరస్కరించడం అంటూ ఉండదు. ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈకేవైసీ చేసుకోవలెను. ఈకేవైసీ కొరకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళ కూడదు’  అని పేర్కొన్నారు.


గడువు పొడిగిస్తాం: మంత్రి నాని
ఈకేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సూచించారు. కుటుంబంలో ఒకరిదైన వేలుముద్ర, లేదా ఐరిష్ నమోదు అయితే కుటుంబానికి ఈకేవైసి వర్తిస్తుంద మంత్రి తెలిపారు.సెప్టెంబర్ 5వరకు ఈకేవైసీ నమోదుకు గడువు ఉన్నా అవసరమైతే గడువు పొడిగిస్తామన్నారు. ఈకేవైసీ నమోదు కాకపోతే రేషన్ కార్డు తొలగిస్తామన్నా పుకార్లు ప్రజలు నమ్మవద్దుని అన్నారు.

మరిన్ని వార్తలు