నీటిసంఘాల ఎన్నికలకు పచ్చజెండా

23 Aug, 2015 05:10 IST|Sakshi

భీమవరం : నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కలెక్టర్ అధ్యక్షతన నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై ఎన్నికల తేదీలను ఖరారు చేయనున్నారు. పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ పరిధిలో 131 నీటి వినియోగదారుల సంఘాలు, 20 నీటి పంపిణీ కమిటీలు ఉన్నాయి. వీటితోపాటు మెట్ట ప్రాంతంలో 16 మీడియం, 229 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పరిధిలో నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న జీవో-20 జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. వీటిని అనుసరించి కలెక్టర్లు నీటి సంఘాల ఎన్నికల తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.  ఎన్నికల తంతును సెప్టెంబర్ 12వ తేదీలోగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో నీటి పారుదల శాఖాధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
 
 టీసీ సభ్యుల సంఖ్య కుదింపు
 నీటి వినియోగదారుల సంఘాల పరిధిలో గతంలో 12 ప్రాదేశిక (టీసీ) సభ్యులు ఉండేవారు. వారిలో ఒకరిని అధ్యక్షునిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. 10 మంది టీసీలుగా ఉండేవారు ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కాకుండా టీసీ సభ్యుల సంఖ్యను నాలుగుకు కుదించింది. గతంలో నామినేషన్లు స్వీకరించి ఎన్నిక నిర్వహించేవారు. ఇప్పుడు గ్రామ సభల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన విధిం చింది. నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైన వారం తా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవడం, వారంతా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
 
 ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..
 నీటి సంఘాల పదవులను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేస్తున్నారు. గ్రామ సభల పేరుతో ఎన్నికలు నిర్వహించాలని పైకి చెబుతున్నా.. ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులనే ఎన్నుకునేవిధంగా లోపాయికారీ ఒప్పందాలు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు