పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్లే

3 Apr, 2020 10:54 IST|Sakshi

రేషన్‌ కార్డుదారులకు శనివారం నుంచి రూ. 1000 అందజేస్తాం: బాలినేని

సాక్షి, ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన, కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం అన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులన్ని ఢిల్లీ మర్కజ్కి వెళ్లి వచ్చిన వాళ్లవేనని, ఇంకా ఎవరైనా ఢిల్లీ వెళ్లివచ్చిన వాళ్ళు ఉంటే స్వచ్ఛదంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి బాలినేని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా నిత్యావసర సరుకులు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని బాలినేని మరోసారి హెచ్చరించారు. సీఎం జగన్‌ ముందు చూపుతో వాలంటీర్ల వ్యవస్థ అమలు చేశారని, కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో వారే కీలకంగా మారారన్నారు. అధికారులు, ఉద్యోగులు అందరూ బాగా కష్టపడుతున్నారని వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న రేషన్‌ కార్డుదారులకు శనివారం నుంచి రూ. 1000 అందజేయనున్నామని బాలినేని తెలిపారు.

మరిన్ని వార్తలు