అర్హత కంటే నైపుణ్యం ముఖ్యం

13 Feb, 2015 03:07 IST|Sakshi

ఏఎన్‌యూ: ఉపాధి అవకాశాలు పొందడానికి, సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యార్హతల కన్నా  నైపుణ్యం లక్షణాలు ముఖ్యమని డీఆర్‌డీఓ, ఆర్‌ఏసీ చైర్మన్ ఆచార్య డీఎన్ రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు  యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహించిన అనుశోధన (నేషనల్ లెవల్ స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం)ను గురువారం ఆయన ప్రారంభించారు.
 
  ప్రారంభోత్సవ సభలో డీన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అర్హత కలిగిన వారు అధికంగా  ఉన్నారు కానీ నైపుణ్యం ఉన్న వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. భారతదేశంలో నైపుణ ్యవంతులు 20 శాతం లోపు ఉంటే సింగపూర్, మలేషియాల్లో 80 శాతం ఉన్నారని తెలిపారు.  విద్యార్థులు పుస్తకాలతోపాటు సమాజాన్ని కూడా అధ్యయనం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలని సూచించారు. వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు మాట్లాడుతూ  విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అనుశోధన వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.
 
  ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సిద్దయ్య, డీన్ ఇ. శ్రీనివాసరెడ్డి, ఇస్రో శాస్త్రవేత్త జగన్నాధదాస్, అనుశోధన కన్వీనర్ ఆచార్య పీవీ రమణారావు ప్రసంగించారు. అనంతరం అనుశోధన సీడీని ఆచార్య డీఎన్ రెడ్డి ఆవిష్కరించారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన వెయ్యిమందికి పైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని టెక్నికల్, పోస్టర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్‌పో అంశాల్లో ప్రదర్శనలు చేశారు. ఉత్తమ ప్రదర్శనలకు సాయంత్రం జరిగిన ముగింపు సభలో బహుమతులు అందజేశారు.
 

మరిన్ని వార్తలు