బిల్లు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉధృతం :జూడాలు

8 Aug, 2019 12:04 IST|Sakshi

వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగుల పడిగాపులు

సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడ బిఆర్టీఎస్‌ రోడ్డులో జూనియర్‌ డాక్టర్లు భారీ ర్యాలీ చేపట్టారు.ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) పిలుపు మేరకు నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుప్రతుల్లో గురువారం వైద్య సేవలు నిలిపివేశారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేవిధంగా ఎన్‌ఎంసీ బిల్లు ఉందని తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో 50 శాతం సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

బిల్లులోని లోపాలను సవరించాలి: 
నెల్లూరు: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లును వ్యతిరేకిస్తూ నగరంలోని కలెక్టరేట్‌ ముందు జూనియర్‌ డాక్టర్లు ధర్నానిర్వహించారు. కేంద్రం జోక్యం చేసుకుని ఎన్‌ఎంసీ బిల్లులోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు.

తిరుపతి రుయా ఆసుప్రతిలో రోగుల పడిగాపులు:
తిరుపతి: ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ వైద్యులు సమ్మె చేపట్టడంతో తిరుపతి రుయా ఆసుప్రతిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. బిల్లును వెంటనే రద్దు చేయాలని జూడాలు డిమాండ్‌ చేశారు. గత ఏడు రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లతో పాటు ప్రవేట్ వైద్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. గురువారం వైద్య సేవలను నిలిపి వేశారు. జూడాలు సమ్మెకు దిగడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రైవేట్‌  ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా.. ఆర్థిక స్తోమత లేనివారు ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు కేంద్రానికి వ్యతిరేకంగా జూడాలు తమ నిరసన కొనసాగిస్తున్నారు
 

>
మరిన్ని వార్తలు