25 శాతంలోపు పనులు పూర్తయిన ప్రాజెక్టులపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. 25 శాతంలోపు పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల పనులపై శుక్రవారం సచివాలయంలో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లతో ఆయన సమావేశమయ్యారు.
25 శాతంలోపు పనులు పూర్తయిన ప్రాజెక్టుల విలువ రూ.22,880.44 కోట్లని, ఇప్పటివరకూ చేసిన పనులకు రూ.1,191.15 కోట్లు బిల్లులు చెల్లించామని.. ఆ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ.21,689.29 కోట్లు అవసరమని ఆదిత్యనాథ్ దాస్ మంత్రి బుగ్గనకు వివరించారు. ఈ ప్రాజెక్టుల్లో అవసరమైనవి ఏవి? అనవసరమైనవి ఏవి? అన్నది గుర్తించాలని మంత్రి సూచించారు.