పోస్టల్‌ బ్యాలెట్లకు బదులు ఖాళీ కవర్లు

7 May, 2019 04:27 IST|Sakshi

రిటర్నింగ్‌ అధికారుల నిర్వాకం

అవాక్కవుతున్న ఉద్యోగులు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీ అనుకూల అధికారుల నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తారనే అనుమానంతో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసిన వారిలో కొందరికి ఖాళీ కవర్లు పంపిస్తున్నారు. వాటిని అందుకున్న ఉద్యోగులు కవరు తెరిచి చూస్తే దానిలో బ్యాలెట్‌ పత్రాలు కనిపించక అవాక్కవుతువున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో ఈ విషయం వెలుగు చూసింది. వి.ముక్తేశ్వరి అనే ఉద్యోగికి నియోజకవర్గంలోని 23వ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు ఉంది. ఓటరు లిస్టులో ఆమె పేరు వరుస సంఖ్య 709లో నమోదైంది.

ఆమెతోపాటు మరో ఇద్దరికి కూడా రిటర్నింగ్‌ అధికారులు పోస్టల్‌ బ్యాలెట్లు లేకుండా ఖాళీ కవర్లు పంపించారు. ఇదిలావుంటే.. పీబీ పల్లెకు చెందిన సవరపు వినోద్‌కుమార్, పెదబొండపల్లికి చెందిన గంటా నవీన్,  తాళ్లబురిడికి చెందిన సంబంగి సత్యనారాయణ, జగ్గన్న సింహాచలం, గెడ్డలుప్పికి చెందిన కళింగపట్నం నాగరాజు, టి.సంతోష్, తాళ్ల బురిడికి చెందిన జి.శ్రీనుతో పాటు చాలామంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారెవరికీ బ్యాలెట్‌ పత్రాలు ఇంతవరకు అందలేదు. అలాగే, ఒక నియోకవర్గంలో ఉన్న పోస్టల్‌ ఓట్లను వేరే నియోజకవర్గంలో ఇస్తున్నారు. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైౖవేటు ఉద్యోగులు ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఓటేస్తారనే భయంతోనే వారిలో సగం మందిని ఓటేయకుండా చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు