మృత్యువులోనూ వీడని బంధం

14 Sep, 2015 03:49 IST|Sakshi
మృత్యువులోనూ వీడని బంధం

వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడికైనా కలిసే వెళ్తుండే వారు.. ఈ క్రమంలో తోట వద్దకు మోటార్‌సైకిల్‌పై బయలుదేరారు.. ఇదే చివరి ప్రయాణమవుతుందని పాపం వారు ఊహించి కూడా ఉండరు.. మార్గమధ్యంలో మృత్యువు లాంటి లారీ కబళించింది.. మరణంలోనూ వారి బంధం వీడలేదు.. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.
 
 చక్రాయపేట :  మండలంలోని వేంపల్లె - రాయచోటి రహదారి వద్ద తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి నుంచి ఎర్రగుంట్లకు వెళ్తున్న లారీ (నంబర్: కేఏ05పి 1745), ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చక్రాయపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురంపేటకు చెందిన కొండయ్య కుమారుడు ఓబులేసు(27), కుప్పం గ్రామం వడ్డేపల్లెకు చెందిన నారాయణ కుమారుడు శంకరయ్య(32) చదువు ముగిసినప్పటి నుంచి స్నేహితులుగా కలిసిమెలిసి తిరిగారు. వారి తల్లిదండ్రులు  20 ఏళ్ల నుంచి స్నేహంగా ఉండటంతో.. వీరు కుటుంబ స్నేహితులుగా మెలిగారు. ఓబులేసు వేంపల్లెలో నెట్ సెంటర్ నిర్వహిస్తుండగా, శంకరయ్య రైతుగా ఉంటూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించారు.

 తోట వద్దకు వెళ్తుండగా:
 ఈ క్రమంలో వారు వేంపల్లె సమీపంలోని శంకరయ్య తోట వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వేంపల్లె నుంచి ఓబులేసు, వడ్డేపల్లె నుంచి శంకరయ్య బయలుదేరి మార్గమధ్యంలో కలుసుకుని, వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం చేయించడానికి వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని బోరున విలపించారు.

కొండయ్యకు ఓబులేసుతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడంతో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఓబులేసుకు భార్య రాధిక, 6 నెలల కుమారుడు ఉన్నారు. రాధిక తన చంటిబిడ్డను తీసుకుని భర్త మృతదేహంపై పడి విలపించడం అక్కడి వారి హృదయాలను కలిచి వేసింది. లారీ డ్రైవర్ చంద్రశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోవిందరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు