దేశవ్యాప్తంగా 48 కేంద్రాల్లో ‘గ్యాట్‌’

12 Nov, 2017 02:19 IST|Sakshi

ఏప్రిల్‌ 11 నుంచి 26 వరకు ప్రవేశ పరీక్షలు

సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): గీతం విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెలలో ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.ప్రసాదరావు వెల్లడించారు.  గీతం వర్సిటీలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అఖిల భారత స్థాయి గీతం అడ్మిషన్‌ టెస్ట్‌ (గ్యాట్‌)–2018 వివరాలను తెలియజేశారు. వర్సిటీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌లో 10 బీటెక్‌ కోర్సులకు, ఈసీఈ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో ఆరు సంవత్సరాల డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు (బీ.టెక్‌+ఎం.టెక్‌), 17ఎం.టెక్‌ కోర్సులకు, బీ.ఫార్మశీ, ఎం.ఫార్మశీ కోర్సులకు, ఐదేళ్ల బి.ఆర్క్‌ కోర్సుకు, రెండేళ్ల ఎం.ఆర్క్‌ కోర్సుకు గ్యాట్‌–2018 ప్రవేశ పరీక్షను అఖిల భారతస్థాయిలో దేశంలోని 48 పట్టణాలలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తోందన్నారు.

ప్రవేశ పరీక్ష దరఖాస్తులు దేశవ్యాప్తంగా అన్ని యూనియన్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ శాఖలలో లభిస్తాయని వివరించారు. గీతం ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌  www.gitam.edu ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు వచ్చే ఏడాది మార్చి 26వ తేదీలోగా అందజేయాలన్నారు. ఏప్రిల్‌ 5 నుంచి గీతం వెబ్‌సైట్‌లో హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11 నుంచి 26 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రవేశ పరీక్ష పూర్తయిన వారం రోజుల తర్వాత ఫలితాలు  వెల్లడిస్తామన్నారు.

గీతం ప్రవేశ పరీక్షలో ఒకటి నుంచి  10 ర్యాంకర్లకు ఉచిత విద్య అందిస్తామని వీసీ చెప్పారు. 11 నుంచి 100 ర్యాంకు వరకు   ఫీజులో 50శాతం రాయితీ ఉంటుందన్నారు.  ఈ సందర్భంగా గ్యాట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో ప్రో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.పోతరాజు, అడ్మిషన్ల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు