ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల పోలింగ్
రీజియన్లో తొమ్మిది చోట్ల ఎంప్లాయీస్ యూనియన్ ఆధిక్యం
నాలుగు చోట్ల ఎన్ఎంయూ..
మ్యాజిక్ ఫిగర్ దాటని సంఘాలు
నెహ్రూనగర్(గుంటూరు): ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకు ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎటువంటి ఘటనలు జరుగుకుండా పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 డిపోల్లో 4,737 ఓట్లు ఉండగా, 4, 653 ఓట్లు పోలయ్యాయి. డిపోల వారీగా పోలింగ్ శాతం పరిశీలిస్తే వరుసగా గుంటూరు–1 డిపోలో 717 ఓట్లగాను 703, గుంటూరు–2 డిపోలో 500 ఓట్లకు గాను 491, తెనాలి డిపోలో 421 ఓట్లకు గాను 412, మంగళగిరి 226 ఓట్లకు గాను 221, పొన్నూరు 231 గాను 225, బాపట్ల 204 గాను 201, రేపల్లె 254 గాను 249, నరసరావుపేట 395 గాను 384, చిలకలూరిపేట 433 గాను 428, సత్తెనపల్లి 251 గాను 247, వినుకొండ 398 గాను 392, పిడుగురాళ్ల 312 గాను 309, మాచర్ల 395 గాను 391 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు రీజియన్లో జరిగే ఎన్నికలు లేబర్ అధికారుల సమక్షంలో జరిగాయి. గుంటూరు 1, 2 డిపోలో జరిగే ఎన్నికలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ యు.మల్లేశ్వరకుమార్ పరిశీలించారు.