నవ సారథులు

8 Jan, 2015 00:08 IST|Sakshi
నవ సారథులు

ఎట్టకేలకు కీలక పోస్టుల భర్తీ
జేసీగా  జె.నివాస్
జీవీఎంసీ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్
వుడా వీసీగా బాబూరావు నాయుడు
ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా ముత్యాలరాజు
 

విశాఖపట్నం :ఇన్‌చార్జిల పాలనకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త అధికారులు బుధవారం నియమితులయ్యారు. జిల్లాలోని కొందరు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగించిన ప్రభుత్వం మరికొందరిని కొత్తగా కేటాయించింది. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు వుడా వైస్ చైర్మన్ పోస్టులు సుమారు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఐఏఎస్‌ల పంపకాలు పూర్తికావడంతో ఖాళీగా ఉన్న ఈ రెండు పోస్టులతో పాటు కీలకమైన జేసీ, ఐటీడీఏ పీవోలతో పాటు  ఏపీఈపీడీసీఎల్ సీఎండీలకు స్థానచలనం కలిగించారు. వారి స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు కూడా బదిలీ తప్పదన్న వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బ్రేకు పడింది. జాయింట్ కలెక్టర్‌గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన జే.నివాస్‌ను నియమించారు. ఆదిలాబాద్ ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న ఈయన్ను ఏపీకి కేటాయించారు. తెలంగాణా ప్రభుత్వం రిలీవ్ చేయడంతో ఈయన్ని జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధిక గిరిజన జనాభా ఉన్న విశాఖలో ఐటీడీఏ పీవో పోస్టు కీలకమైంది. ఈ పోస్టులో ఇంతకాలం ఉన్న ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్‌ను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈయన స్థానంలో ఎం.హరినారాయణను నియమించింది. ఈయన్ను కూడా తెలంగాణ నుంచి ఏపీకి కేటాయించారు. సివిల్స్‌లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచిన రేవు ముత్యాల రాజును ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న శేషగిరిబాబు కీలకమైన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. గతంలో జిల్లాలో డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన టి.బాబూరావు నాయుడును వుడా వైస్ చైర్మన్‌గా నియమించారు.
 
నెగ్గిన ‘గంటా’ పంతం
 
జేసీ ప్రవీణ్‌కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రస్తుతం ఇన్‌చార్జి బాధ్యతలను నిర్వర్తిస్తున్న జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్‌గా నియమించారు. ఈ విషయంలో రాష్ర్టమంత్రి గంటా శ్రీనివాసరావు పంతం నెగ్గించుకున్నారు. హుద్‌హుద్ తుఫాన్ ముందే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ అయినప్పటికీ ఆ జిల్లా ప్రజాప్రతినిధుల వ్యతిరేకతతో జిల్లాలో కొనసాగుతున్న జేసీని కమిషనర్‌గా నియమించాలని గంటా తన వియ్యంకుడు మున్సిపల్ శాఖామంత్రి నారాయణ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఏడాదిగా ఖాళీగా ఉన్న జీవీఎంసీ కమిషనర్, వుడా వైస్ చైర్మన్ పోస్టుల భర్తీతో ఇన్‌చార్జిల పాలనకు కూడా పూర్తిగా తెర పడినట్టయింది. పోలీస్ కమిషనర్ పోస్టును కూడా భర్తీ చేస్తే జిల్లా పాలన పూర్తి స్థాయిలో గాడిలో పడనుంది.
 

మరిన్ని వార్తలు