అధినేతకు అధికారం.. కార్యకర్తలకు హత్యలు..

17 Mar, 2019 12:58 IST|Sakshi
మేడికొండూరు వద్ద తెలుగుదేశం కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రయాణించిన బస్సు దృశ్యాలు(ఫైల్‌)

సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యలకు తెగబడుతున్నారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫ్యాక్షన్‌తో పల్నాడు ప్రాంత గ్రామాలు అట్టుడికిపోయాయి. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పదేళ్లపాటు ఆ గ్రామాలు ఫ్యాక్షన్‌కు దూరంగా ప్రశాంతంగా ఉన్నాయి. పదేళ్ల తరువాత 2014లో అధికారంలోకి వచ్చామనే గర్వంతో అడ్డగోలుగా దాడులు చేస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారు. 

జిల్లాలో టీడీపీ హత్యాకాండ ఇలా..
- 1999లో ఎన్నికల సందర్భంగా నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో ఆయన అనుచరులు నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు, నరసరావుపేట ఎన్నిక సైతం వాయిదా పడింది. దీనిపై సీబీఐ విచారణ జరగకుండా అప్పట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలను పట్టుకుని బయటపడగలిగారు. 
- 2001 మార్చి 9వ తేదీన మాచర్ల నుంచి దుర్గి పోలీసు స్టేషన్‌కు బైండోవర్‌ సంతకాలు చేసేం దుకు వెళ్తున్న కాంగ్రెస్‌ వర్గీయులను టీడీపీ నాయకులు పక్కా పథకం ప్రకారం దుర్గి మండలం ఆత్మకూరు బోడు వద్ద బాంబులు, వేట కొడవళ్లతో దాడిచేసి ఏడుగురిని ఒకేసారి నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచల నం కలిగించింది. పోలీసుల సాయంతో ఈ హత్యకు పథక రచన చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.    
- 2014 సెప్టెంబర్‌ 22న వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిని అధికారపార్టీ నాయకులు హత్యచేశారు. 
- నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో అతను మృతి చెందాడు. తిరిగి వైఎస్సార్‌ సీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. హత్య కేసుకు కౌంటర్‌ కేసు ఉంటే రాజీకి వస్తారన్న టీడీపీ నేతల దుర్మార్గపు ఆలోచనకు పోలీసులు వంతపాడారు.
- 2014 సెప్టెంబర్‌ 11వ తేదీన మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం చినగార్లపాడు గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి(45)ఇంటిపై టీడీపీ రౌడీలు మూకుమ్మడిగా దాడిచేశారు. గోవిందరెడ్డి పారిపోతుండగా వెంటాడి నడిరోడ్డు పొడిచి చంపారు. అడ్డు వచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందకు ప్రయత్నించారు. గోవిందరెడ్డిని హత్యచేస్తున్న సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డినీ హత్య చేసేందుకు యత్నిం చారు. కత్తి, బరిసె పోట్లకు గురైన ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 
-  2014 డిసెంబర్‌ 19న మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్‌ సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్య కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి కిరాతకంగా చంపారు.
- 2013 సంవత్సరంలో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్‌ సీపీ నేత పెద వెంకటేశ్వర్లు(బ్రహ్మం)ను టీడీపీ వర్గీయులు నరికి చంపారు. 
- 2017 డిసెంబర్‌లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎ స్సార్‌ సీపీ నేత కంచర్ల సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేట కొడవళ్లతో నరికి చంపారు. 
- వేమూరు నియోజకవర్గం పెరవలిపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి చెందిన ఎస్‌.ప్రభాకరరావుపై టీడీపీకి చెందిన సర్పంచ్‌ సాంబశివరావు వర్గీయులు 30 మంది దాడి చేసి కొట్టడంతో ఆయన మృతిచెందాడు.  

>
మరిన్ని వార్తలు