టీటీడీ, పీఎన్‌బీల మధ్య ఒప్పందం బయటపెట్టాలి : చింతా

6 May, 2019 14:59 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై మాజీ ఎంపీ చింతమోహన్‌ స్పందించారు. ఈ క్రమంలో శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అనుమానాలు లేవనేత్తా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల హుండీ ఆదాయం రోజూ ప్రకటిస్తున్న టీటీడీ అధికారులు.. నిలువు దోపిడీ ఆదాయం వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హుండీలో భక్తులు వేస్తోన్న విలువైన వజ్రాలు లెక్కల్లోకి రాకుండా మధ్యలోనే కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. టీటీడీలో అసలు జమాలజిస్టులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.

అం‍తేకాక టీటీడీ బంగారం చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసిన సమయంలో బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్‌ రెడ్డి పాత్ర బయటకు రావాలని చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు. గతంలో శేఖర్‌ రెడ్డి ఇంట్లో జరిగిన దాడుల్లో దొరికిన బంగారంలో టీటీడీ బంగారం కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవారి సొమ్ము రూ. 11 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఏ ఏ బ్యాంకులలో ఉన్నాయో భక్తులకు తెలియాలన్నారు. టీటీడీకి, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కి మధ్య ఉన్న ఒప్పందం ఏంటో బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ బ్యాంక్‌తో టీటీడీకి మధ్య ఉన్న లావాదేవీలు ఏంటో జనాలకు చెప్పాలన్నారు. టీటీడీ అవినీతిపై ఈఓను చర్చకు పిలిచాను.. కానీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చర్చకు రాకుండా ముఖం చాటేస్తున్నారని చింతా మోహన్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు