సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణం నుంచి ఆయన పత్తా లేకుండా పోయారు. కృష్ణా నదికి వరద పోటెత్తి ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే కరకట్ట వద్దనున్న అక్రమ నివాసంపై స్పందిస్తున్న లోకేష్.. వరద ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేయాలని కనీసం టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
గెలిచినా, ఓడినా అంటూ..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన నారా లోకేష్ తాను గెలిచినా, ఓడినా స్థానికంగా, ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి ఆయన ముఖం చాటేశారు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు రావడంతో తూతూమంత్రంగా వారం రోజులు హడావుడి చేసి అనంతరం మళ్లీ తెరవెనుకకు వెళ్లిపోయారు.
సమావేశాలు ముగియగానే..
బడ్జెట్ సమావేశాలు జూలై ఆఖరున ముగిశాయి. ఆ తర్వాత నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ ఉంటున్నారో.. ఏం చేస్తున్నారో కూడా ఎవరికి సమాచారం లేదు. ఇటు మంగళగిరి, అటు ఉండవల్లిలోని ఆయన నివాసంలోనూ
ఆచూకీ లభించడం లేదు. ట్విట్టర్లోనే స్పందన
కృష్ణా నదికి వరద పోటెత్తడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. ట్విట్టర్లో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుండడంపై మాజీ మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే సాయం చేయాల్సిన విషయం మరిచి, తన ఇంటిపైనే ధ్యాసనంతా ఉంచారని పలువురు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున వచ్చిన వరదతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ఉండవల్లిలోని అక్రమ నివాసం మునకపైనే దృష్టి సారించారని అంతా మండిపడుతున్నారు.
సినిమా చూడాలంటూ ట్వీట్..!
కృష్ణమ్మ శాంతించడంతో లంక గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూసుకుంది. ఇదేమీ పట్టన్నట్లు సాహో సినిమాను టీడీపీ శ్రేణులు చూడాలని లోకేష్ ట్వీట్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి సమయాల్లో ఎలా స్పందించాలో తెలియకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన అజ్ఞాతాన్ని వీడి జనంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారు.
సైనిక్’ సభ్యుడిగా నివృతరావు
మైలవరం: మైలవరం జమీందారీ వంశీకులు, ద్వారకా తిరుమల దేవస్థానాల చైర్మన్ ఎస్వీ సుధాకరరావు తనయుడు, మాజీ లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్.వి.నివృతరావు సైనిక్ వెల్ఫేర్ బోర్డు సభ్యుడుగా నియమితులైనట్లు ఆయన కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆయన ఆ పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు.