కానిస్టేబుళ్ల ఎంపికకు సర్టిఫికెట్ల పరిశీలన

1 Jun, 2017 01:53 IST|Sakshi

విజయనగరం టౌన్‌: పోలీస్‌ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల ఒకటో తేదీ నుంచి  రెండురోజుల పాటు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎల్‌.కె.వి.రంగారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సివిల్‌ విభాగంలో 192, ఆర్మ్‌డ్‌ రిజర్వు 107, జైలు వార్డర్లు19(పురుష), 11 మహిళ ఉద్యోగాలకు ఎంపికైన  అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం వారికివైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు అభ్యర్థుల గత చరిత్రను స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు పరిశీలిస్తారని ఎస్పీ తెలిపారు.

తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు
సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వు, జైలువార్డర్ల ఉద్యోగాలకు ఎంపికైన మహిళా, పురుష అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే  సమయంలో సమర్పించిన విద్యార్హత, కుల, క్రీడా వగైరా ధ్రువపత్రాల ఒరిజినల్స్, గెజిటెడ్‌ అధికారితో అటెస్ట్‌ చేయించిన రెండు సెట్స్‌ జెరాక్స్‌ కాపీలను, ఇటీవల తీసుకున్న మూడు కలర్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను తమ వెంట తీసుకుని రావాలని చెప్పారు. అభ్యర్థులు వెనుకబడిన తరగతులకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రంతో పాటు క్రిమిలేయర్‌ ధ్రువపత్రాన్నీ తీసుకురావాల్సి ఉంటుందన్నారు.  ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు.

మరిన్ని వార్తలు