సెప్టెంబర్‌1 నుంచి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు 

20 Aug, 2019 06:46 IST|Sakshi

పరీక్షకు హాజరు కానున్న 1,74,820 మంది  

సెప్టెంబర్‌ 1, 3, 4, 5, 7, 8  తేదీల్లో పరీక్షలు  

జిల్లా వ్యాప్తంగా 11 క్లస్టర్లు, 363 పరీక్ష కేంద్రాలు  

డీఎస్సీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల ఎంపిక  

సాక్షి, అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు జిల్లా వ్యాప్తంగా 1,74,820 మంది పరీక్ష రాయనుండగా.. వారిని కేటగిరీ వారీగా విభజించి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాను 11 క్లస్టర్లుగా విభజించిన అధికారులు మొత్తం 363 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెప్టెం    బర్‌ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. 

డీఎస్సీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల ఎంపిక 
జిల్లా సెలెక్షన్‌ కమిటీ(డీఎస్సీ) ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం 18 మందితో కూడిన కమిటీని నియమిస్తూ సోమవారం పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సెలెక్షన్‌ కమిటీ(డీఎస్సీ) చైర్మన్‌గా కలెక్టర్‌ సత్యనారాయణ, వైస్‌ చైర్మన్లుగా ఎస్పీ సత్యయేసుబాబు, జాయింట్‌ కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ఇక కమిటీలో జాయింట్‌ కలెక్టర్‌–2, జిల్లా పరిషత్‌ సీఈఓ శోభస్వరూపరాణి, వ్యవసాయశాఖ జేడీ, పశుసంవర్ధక శాఖ జేడీ, ఉద్యానశాఖ డీడీ, పట్టుపరిశ్రమ శాఖ డీడీ, మత్స్యశాఖ డీడీ, సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ, అడిషనల్‌ ఎస్పీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, డీఈఓ, ఐసీడీఎస్‌ పీడీలు ఉంటారు.  

మరిన్ని వార్తలు