కచ్చులూరు వద్ద బోటు వెలికితీత

22 Oct, 2019 17:31 IST|Sakshi

సాక్షి, దేవీపట్నం : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో బోటును పూర్తిగా బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది.  కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు. 

రోప్‌ సాయంతో బయటకు తీశాం : ధర్మాడి సత్యం
రోప్‌ల సాయంతోనే బోటును బయటకు తీశామని ధార్మడి సత్యం అన్నారు. బోటు బయటకు తీయడంలో తన బృందంతో పాటు అధికారుల కష్టం కూడా ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.


మరిన్ని వార్తలు