డెమో రైలును కర్నూలు వరకూ పొడిగించండి

30 Nov, 2018 14:03 IST|Sakshi

 రైల్వే జీఎం వినోద్‌కుమార్‌తో చర్చించిన మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

సాక్షి కడప :  కర్నూలు నగరంలో డిసెంబరు నెల 8 నుంచి 10వ తేదీ వరకు ముస్లిం సోదరుల ఆలమి దీని ఇజ్‌తెమ (ఆ«ధ్యాత్మిక సమ్మేళనం) కార్యక్రమం జరగనుందని...అందుకు సంబంధించి కడపతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే ముస్లిం సోదరులకు అనువుగా ఉండేలా ప్రస్తుతం నడుస్తున్న డెమో రైలును కర్నూలు వరకు పొడిగించాలని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.   గురువారం హైదరాబాదులోని రైల్వే నిలయంలో సౌత్‌ సెంటల్ర్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌తో మాజీ ఎంపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 నుంచి 25 లక్షల మంది ఆలమి దీని ఇజ్‌తెమకు వస్తారని...ఈ నేపథ్యంలో కడప–నంద్యాల, నంద్యాల–కడప మధ్య నడుస్తున్న డెమో రైలును కర్నూలు  వరకు పొడిగించడం ద్వారా ముస్లిం సోదరులు వెళ్లడానికి, రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు  మీదుగా వెళుతున్న రైలులో నంద్యాల వరకు వెళుతున్న వారికి కర్నూలు వరకు అవకాశం కల్పించడం ద్వారా మూడు రోజులు ముస్లిం సోదరులకు వెసులుబాటు కల్పించినట్లుంటుందని ఆయన తెలియజేశారు. డిసెంబరు 7వ తేది నుంచే పొడిగింపునకు చర్యలు చేపట్టాలని కోరారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల నుంచి వేలల్లో ముస్లిం సోదరులు ఈ రైలు ద్వారా ప్రయాణం చేసేందుకు అనువుగా ఉంటుందని ఆయన జీఎం దృష్టికి తీసుకెళ్లారు.  అందుకు జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించారు. వెంటనే బోర్డు మీటింగ్‌లో చర్చించి పొడిగింపుకు తగిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి హామి ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు