రాజధానికి అటవీభూమి ప్రతిపాదనపై స్పష్టం చేసిన ఎఫ్ఏసీ
సాక్షి, హైదరాబాద్: దట్టమైన పచ్చని అడవిని రాజధాని కోసం కావాలంటూ ప్రత్యామ్నాయంగా రాతి నేలలు ప్రతిపాదిస్తారా? రాతి నేలల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి? పర్యావరణ సమతౌల్యం ఎలా ఏర్పడుతుంది? ఏయే అవసరాలకు ఎంతెంత అటవీ భూమి కావాలో ఎందుకు సమర్పించలేదు? గుండుగుత్తగా అటవీభూమి బదలాయించాలని ప్రతి పాదిస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలి? అంటూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సలహా కమిటీ (ఎఫ్ఏసీ) ప్రశ్నల వర్షం కురిపించింది.
ఏపీ రాజధాని అమరావతికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 13,267.12 హెక్టార్ల (32,783.76 ఎకరాల) అటవీభూమిని బదలాయించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)/ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఎఫ్ఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది.