ఇంటర్‌లో ఫెయిలైన ఎంసెట్ ర్యాంకర్లు

10 Jun, 2014 02:20 IST|Sakshi

36 వేల మందిది ఇదే పరిస్థితి   రీ వెరిఫికేషన్‌లో వచ్చిన మార్కులు లేకుండానే ఎంసెట్ ర్యాంకులు
 
హైదరాబాద్: ఎంసెట్‌లో ర్యాంకు సాధించినా, ఇంటర్ మీడియెట్‌లో 36,310 మంది ఫెయిల్ అయ్యారు. అయితే చాలా మందికి ఇంటర్‌మీడియట్‌లో పరీక్షలు బాగా రాశామని నమ్మకం ఉన్న విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన వారు, ఫెయిల్ అయిన వారు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో చాలా మందికి మార్కులు అదనంగా కలిశాయి. 1 నుంచి 10 మార్కుల వరకు కూడా కలిసిన విద్యార్థులు ఉన్నారు. అయితే, ఇలా అదనంగా వచ్చిన వారి మార్కులను మాత్రం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో పరిగణనలోకి తీసుకోలేదు. ఇంటర్మీడియెట్ బోర్డు సంబంధిత వివరాలను ఎంసెట్ వర్గాలకు ఇంతవరకు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

తమకు రీవెరిఫికేషన్ ద్వారా అదనంగా వచ్చిన మార్కులతో పాస్ అయిన విద్యార్థులు, మార్కులు పెరిగిన విద్యార్థులు తమకు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మే 22న జరిగిన ఈ పరీక్షకు ఇంజనీరింగ్‌లో 2,66,820 మంది హాజరు కాగా 1,88,831 మంది (70.77 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. అయితే మరో 24,723 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయ్యారు. ఇక 1,782 మంది ఇంటర్మీడియట్‌లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. అయితే వారిని ఫెయిల్ అయినట్టుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 1,06,396 మంది పరీక్ష రాయగా 98,292 మంది (83.16శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. మరో 8,371 మంది ర్యాంకు పొందినా ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయ్యారు. 1,434 మంది ఇంటర్‌లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. వారిని కూడా ఫెయిల్ అయినట్టుగానే పరిగణించారు.
 
 

మరిన్ని వార్తలు