సర్వేజన కష్టాలు

20 Aug, 2014 02:11 IST|Sakshi
సర్వేజన కష్టాలు
  • ప్రచార ఆర్భాటమెక్కువ..ఏర్పాట్లు తక్కువ
  •  సమగ్ర సర్వే నిర్వహణలో అధికారుల వైఫల్యం
  •  వరంగల్ నగరంలో మరీ అధ్వానం
  •  వివరాల నమోదుకు ఆసక్తి చూపిన ప్రజానీకం  
  •  అయినా.. ఇళ్లకు రాని సిబ్బంది
  •  ఇబ్బందులు పడిన కుటుంబాలు
  •  స్పందించని టోల్‌ఫ్రీ నంబర్లు
  •  కలెక్టర్ మొబైల్ స్విచ్ ఆఫ్
  •  రాత్రి వరకూ కొనసాగిన సర్వే
  • సాక్షి ప్రతినిధి, వరంగల్ : సరిపోని ఎన్యూమరేటర్లు, తక్కువ పడిన నమోదుపత్రాలు, ఉన్నతాధికారుల ప్రణాళికలేమి, కిక్కిరిసిన బస్సులు, ఊళ్లకు చేరేందుకు ప్రజల అవస్థలు, అవసరమైన సమాచారం కాకుండా అనవసర విషయాలు తెలుసుకోవడం.. వీటి మధ్య జిల్లాలో మంగళవారం సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. సర్వేపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో సఫలమైన ఉన్నతాధికారులు, నిర్వహణ ఏర్పాట్లు మాత్రం సరిగా చేయలేకపోయారు.

    ముందుగా గుర్తించిన 10.69 లక్షల కుటుంబాల వివరాలు సేకరించేందుకు అవసరమైన ఎన్యూమరేటర్ల(వివరాలు సేకరించేవారు)ను సమకూర్చుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. చివరి నిమిషంలో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులను తీసుకోవడంతో సర్వేకు మొదట్లో ఉన్న ప్రాధాన్యత తగ్గినట్లు కనిపించింది. సరిపడా ఎన్యూమరేటర్లు లేకపోవడంతో చాలా కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు నిర్వహించారు.

    కలెక్టరేట్‌లో, కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయకపోవడంతో సర్వే వివరాలు సేకరించే వారు తమ ఇళ్లకు రాకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన వారికి నిరాశే మిగిలింది. ఇబ్బందులు ఉంటే మెస్సేజ్ చేయాలని సూచిస్తూ ప్రకటించిన కలెక్టర్ జి.కిషన్ మొబైల్ సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో ప్రజలు నిరసన తెలిపారు. వివరాలు నమోదు చేసికోని వారు, ఎన్యూమరేటర్లు రాని వారి పరిస్థితి ఏమిటనే విషయంలో స్పష్టత రావాల్సి  ఉందని అధికారులు చెబుతున్నారు.
     
    ప్రజలు ఉత్సాహం చూపినా...

    సమగ్ర కుటుంబ సర్వేలో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే విషయంలో ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఉదయం నుంచి ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూశారు.

    ప్రజలు ఉత్సాహంపై బల్దియా అధికారులు నీళ్లు చల్లారు. ఎన్యూమరేటర్‌లకు కేటాయించిన ఇళ్ల వివరాల విషయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు చేసిన తప్పిదాలతో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. ఎన్యూమరేటర్‌లు తమకు కేటాయించిన ఇంటి నం బర్ల పరిధికి మాత్రమే పరిమితమయ్యారు. వం దలాది మంది కుటుంబాల వివరాలు నమోదు చేయలేదు. 400 మంది ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడింది. ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన మరో 100 మంది విధులకు హజరుకాలేదు.

    నగరంలో 2,44,646 కుటుంబాలు ఉంటే దాదాపు 25వేల కుటుంబాల వివరాలను సేకరించలేకపోయారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం 100 ఫీట్ల రోడ్డు మార్గలోని జవహన్‌కాలనీ, రాంనగర్‌లోని కొన్నిప్రాంతాలు, ఎన్‌ఐటీ ఎదురుగా ఉన్న కాలనీలు, జూలైవాడ, రెవెన్యూకాలనీ, ప్రకాష్‌రెడ్డిపేట తదితర కాలనీల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిసి పరిస్థితి వివరించారు. తమకు సంబంధంలేదని నగరపాలకసంస్థ వారికి ఫిర్యాదు చేయాలని డీఆర్వో సురేందర్‌కరణ్ నిర్లక్ష్యంగా చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు కొందరు కలెక్టర్ అధికారిక నివాసం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. సుబేదారి పోలీసులు నచ్చజెప్పి పంపించారు. నగరంలోని కొత్తవాడ, మర్రివెంకటయ్య కాలనీ, నవయుగ కాలనీ, రామన్నపేట, హన్మకొండలోని కొత్తూరు, కుమార్‌పల్లి, పోలీస్ హెడ్ క్వార్టర్స్, రెడ్డికాలనీ, వడ్డేపల్లి టీచర్స్ కాలనీ, రామకృష్ణ కాలనీ తదితర కాలనీల్లో అసలు సర్వే కోసం ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. 19 డివిజన్‌లోని రఘునాథ్‌నగర్ కాలనీవాసులు 200 మంది కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మరికొందరు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
     
    జనగామ పట్టణం 5 వార్డులో ఎన్యూమరేటర్ ఒకే చోట కూర్చుని సర్వే చేస్తుండగా కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని 8వ వార్డులో పలు ఇళ్లకు, జనగామ మండలం గానుగుపాడ్, వడ్లకొండ, వెంకిర్యాలలో ఇందిరమ్మ ఇళ్లకు, బచ్చన్నపేట మండలం చిన్నరాంచెర్ల జీపీ పరిధిలోని గోపాల్‌నగర్‌లో బుడిగె జంగాలకు చెందిన 50 గుడిసెలకు, నర్మెట మండల కేంద్రంలో పలు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు సర్వే చేయడానికి మొండికేయడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నంబర్లు లేకపోవడంతో పాత ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటున్న చోట ఉమ్మడి కుటుంబంగా వివరాలు ఇవ్వాల్సి వచ్చింది.
     
    మానుకోట నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబరుపై పలు కుటుంబాలు నివాసం ఉన్నా వేర్వేరుగా నంబర్లు ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తింది. మానుకోట పట్టణ శివారు పత్తిపాక, మంగలికాలనీ, తదితర కాలనీలలో ఇండ్లకు నంబర్లు ఇవ్వకపోవడంతో పూర్తిస్థాయిలో సర్వే జరుగలేదు. కేసముద్రంలోనూ రెండుమూడు కుటుంబాలు ఉండే ఇళ్లకు ఒకే నంబరు ఇవ్వడంతో కుటుంబ యజమానులు సిబ్బందితో గొడవపడ్డారు. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం, మునిగలవీడు, చిన్న నాగారం గ్రామాల్లో సూరత్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు సిబ్బంది నిరాకరించగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గూడురు మండలంలోనూ నంబర్ల సమస్య తలెత్తింది.
     
    భూపాలపల్లి పట్టణంలో పలు కాలనీల్లో ఇంటి నంబర్ల ఆధారంగా ఇళ్లను గుర్తించేందుకు ఎన్యూమరేటర్లు కష్టపడాల్సి వచ్చింది. భూపాలపల్లి, గణపురం, చిట్యాల మండలాల అధికారులు సకాలంలో టిఫిన్, భోజనం అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిట్యాలలో కనీసం వాహన సౌకర్యం కల్పించకపోవడంతో కేటాయించిన ప్రాంతాలకు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు. రేగొండ, భూపాలపల్లి, చిట్యాల మండలాల్లో పలు చోట్ల పలు కుటుంబీకుల పేర్లు లిస్టులో లేకపోవడంతో బాధితులు వాగ్వివాదానికి దిగారు.
     
    నర్సంపేట పట్టణంలో 45 వుంది ఎన్యూవురేటర్లు గైర్హాజరయ్యూరు. సూపర్‌వైజర్లు ఇంటి నంబర్ల జాబితాను సరిగా రూపొందించకపోవడంతో సర్వే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. పలు వార్డుల్లో సర్వే టీం ఇంటికి వెల్లని వారి కోసం స్థానిక బాలుర హైస్కూల్‌లో వుూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటావుని ఆర్డీఓ తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఒక ఇంటిలో పలు కుటుంబాలున్నా ఒకే ఫారంలో వివరాలు నమోదు చేయడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
     
    పరకాల నగర పంచాయతీ పరిధి 13వ వార్డులో ఎన్యూమరేటర్లతో స్థానికులు ఘర్షణకు దిగారు. కుటుంబంలో కొందరి పేర్లు మాత్రమే రావడంతో తప్పుడు సర్వే చేస్తున్నారని వాదించారు. పట్టణంలోని ఒక వాడలో ఇద్దరు భార్యలు నా పేరు అంటే నా పేరు రాయమంటూ గొడవకు దిగడంతో ఎన్యూమరేటర్ ఆ ఇంటిని సర్వే చేయకుండా వదిలి వేశారు. పరకాల మండలంలోని వెంకటాపూర్, నాగారం గ్రామాల్లో పలువురి పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. గీసుకొండ మండలం విలీన గ్రామాల్లో ఇంటి యజమానుల కుటుంబాలను మాత్రమే సర్వే చేశారు. వృద్ధుల పేర్లను లేకుండా చేశారు. సంగెం మండలంలోని తిమ్మాపురం, ఎల్గూరు స్టేషన్, మొండ్రాయిలో ఎన్యూమరేటర్లు సర్వే చేయడంలో ఇబ్బంది పడగా కొత్తవారితో చేయించారు. ఆత్మకూరు మండలంలో సిబ్బందికి ఇంక్ ప్యాడ్‌లకు బదులు స్కేచ్ పెన్నులు ఇచ్చారు.
     
    స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సమగ్ర సర్వే ప్రశాంతంగా జరిగింది. పలువురి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యూమరేటర్లు ఆయా కుటుంబాల వివరాలు నమోదు చేసుకోలేదు. దీంతో బాధితులు గొడవకు దిగడంతో అధికారులు కల్పించుకొని సమస్యను పరిష్కరించారు. నియోజకవర్గం మొత్తం సర్వే తీరును జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టరు వి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.
     
    వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగరి, హసన్‌పర్తి(రూరల్), హన్మకొండ గ్రామీణ మండలాల్లో అర్ధరాత్రి సర్వే జరిగింది. 150 మంది ఎన్యూమరేటర్లు విధులకు డుమ్మాకొట్టడంతో కానిస్టేబుళ్లు ఆ విధులు నిర్వర్తించారు. ఎల్లాపురంలో సర్వే ఆలస్యం కావడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కుమ్మరిగూడెం, మడికొండలోని కొన్ని ప్రాంతాల్లో సర్వే జరగలేదు. వర్ధన్నపేట మండలంలో ప్రత్యేక అధికారి బి.సంజీవరెడ్డి సర్వేను పర్యవేక్షించారు.
     
    పాలకుర్తి మండలం బమ్మెర శివారు పలుగుబోడు తండాలో ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబం సర్వే కోసం సొంత ఊరికి వచ్చింది. ఆ ఇంటి దూలం విరిగి పడి లకావత్ ధర్మా కుమారుడు నితిన్ రెండు కాళ్లు విరిగిపోయాయి. ఇంటి నంబర్ల కేటాయింపులో పొరపాట్లపై దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావును ప్రజలు నిలదీసారు. తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల  మండలంలోని పలు గ్రామాల్లో ఇదే విషయంపై ప్రజలు ఎన్యూమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
     
    డోర్నకల్ మండలంలో 46 మంది ఎన్యూమరేటర్లు విధులకు రాలేదు. మరిపెడ మండలంలో ఫారాలు సరిపోలేదు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో ఎన్యూమరేటర్ ఐ.మధు కళ్లు తిరిగి పడిపోయాడు. కురవి మండలం బలపాల, గుండ్రాతిమడుగులో అర్ధరాత్రి వరకు సర్వే జరిగింది.
     
    ఏటూరునాగారం మండలంలో ఒక దగ్గరే కూర్చుని వివరాలు నమోదు చేయడం కని పించింది. కొత్తగూడ మండలంలో సర్వే ప్రశాతంగా ముగిసింది. వెంకటాపురం మం డలంలో ఎన్యూమరేటర్ల కొరత ఏర్పడడం తో ప్రేవేటు ఉపాధ్యాయులను, యువజన సంఘాల సభ్యులతో సర్వే చేయించారు. తాడ్వాయి మండలంలో ఇంటి నంబర్‌లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మంగపేట మండలంలో అధికారులు చేసిన తప్పులపై ప్రజలు నిలదీశారు. కొన్ని ఇళ్లను విస్మరించడంతో బాధితులు గ్రామ పంచాయతీకి చేరుకుని ఆందోళన నిర్వహించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. గోవిందరావు పేట మండలంలో సర్వే ప్రశాతంగా జరిగింది.
     

మరిన్ని వార్తలు