ఫారం 27పై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు
భారీగా చేరుకున్న ఓటర్లు.. చేతులెత్తిసిన అధికారులు
సాక్షి, విశాఖపట్నం: సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని అధికారులు, పోలీసులు ఎంత చెప్పినప్పటికీ ప్రజల్లో మాత్ర మార్పు రావడం లేదు. వాట్సప్లో వైరల్ అవుతున్న ఏ వార్తలైనా గుడ్డిగా నమ్మి పోరపాటుపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల కారణంగా గాజువాక జీవీఎంసీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున తోపులాట జరిగింది. గాజువాక నియోజకవర్గంలో ఓటులేని వాళ్లు ఫారం 27 నింపి ఓటు హక్కుని వినియోగించుకోవచ్చని సోషల్ మీడియాలో ఓ వార్త నిన్నటి నుంచి హల్చల్ చేస్తోంది. దీంతో ఓటు హక్కులేని ఓటర్లు జీవీఎంసీ కార్యాలయానికి భారీగా క్యూకట్టారు. వందల సంఖ్యలో కార్యాలయం వద్ద గుమ్మిగూడారు.
ఈరోజు ఉదయం నుంచి సాయంతం 5 గంటల వరకు సమయం కేటాయించిందని పోస్ట్లు రావడంతో ఓటర్లు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అధికారులు చేతులేత్తేసారు. అయితే ఫారం 27 అనే అంశం లేదని.. అందంతా ఫేక్ అని కొంత మంది కొట్టిపారేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం పట్టించుకోవడంలేదు. కాగా ఫేక్ వార్తలను షేర్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశంఉంది. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా మూడు లక్షలకు పైగా ఓట్లతో గాజువాక మొదటి స్థానంలో నిలిచింది.