నమ్మించి దోచేసిన కుటుంబం

9 May, 2015 19:44 IST|Sakshi

రాజాం (శ్రీకాకుళం): ఇంటి పక్కన వారే కదా అని నమ్మితే.. ఇంట్లోని డబ్బు, బంగారు ఆభరణాలను కొట్టేసి పరారైంది ఓ కిలాడీ కుటుంబం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధిలోని కొండంపేటలో రుంకు వాసుదేవరావు.. భార్య పద్మశ్రీ, ఇద్దరు పిల్లలతో అద్దెకు ఉంటున్నారు. వారి పక్కనే మూడు నెలల క్రితం షేక్ అబీబుల్లా, భార్య లతీఫాలు తమ ఇద్దరు కుమార్తెలతో అద్దెకు దిగారు. వచ్చిన కొద్ది కాలంలోనే వారి మధ్య స్నేహం కుదిరింది.ఈ క్రమంలో పద్మశ్రీ ఇంట్లో ఉన్న సుమారు 25తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.2.5లక్షల నగదు సమాచారాన్ని అబీబుల్లా, లతీఫా తెలుసుకున్నారు. కాగా ఎప్పటిలానే శుక్రవారం సాయంత్రం కూడా వారితో కలివిడిగా ఉండి, రాత్రి 10 గంటల అనంతరం వాసుదేవరావు, పద్మశ్రీ మిద్దెపైకి వెళ్లి నిద్రిస్తుండగా... వారి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు పట్టుకుని అబీబుల్లా కుటుంబం ఆటోలో పరారయ్యారు. శనివారం ఉదయం నిద్రలేచిన వాసుదేవరావు, పద్మశ్రీ జరిగిన విషయాన్ని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు