-

ఫనా.. 2013!

22 Jan, 2014 02:00 IST|Sakshi

 సాక్షి, సిటీబ్యూరో
 బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కథానాయకుడిగా 2006లో విడుదలైన ఫనా చిత్రం గుర్తుందా..? పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు ఏజెంట్‌గా పని చేస్తున్న రెహాన్ ఖాన్ (అమీర్‌ఖాన్) ‘న్యూక్లియర్ ఆపరేషన్’ కోసం భారత్‌కు వచ్చి ఢిల్లీలో గైడ్‌గా స్థిరపడతాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న తెహసీన్ అక్తర్ అలియాస్ మోను కూడా సరిగ్గా ఇదే తరహాలో వ్యవహరించాడు. యాసీన్ భత్కల్ అరెస్టు తరవాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న మోను... కొన్నాళ్ల పాటు రాజస్థాన్‌లో గైడ్‌గా పని చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఈ ‘ఫనా... 2013’ కథాకమామిషు...
 ఎవరీ మోను?
     బీహార్‌లోని సమిస్తీపూర్ సమీపంలో ఉన్న మణియార్‌పూర్‌కు చెందిన కెమిస్ట్ కుమారుడే ఈ మోను.
     23 ఏళ్ల ఈ యువ టైస్ట్ ఐఎంలో ఉన్న వాంటెడ్ ఉగ్రవాదుల్లోనే చిన్న వయస్కుడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
     తెహసీన్ అక్తర్ తలపై రూ.10 లక్షల రివార్డు సైతం ఉంది.
     నిషిద్ధ సూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లి... ఐఎం కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు కుడి భుజంగా మారాడు.
 ఏఏ విధ్వంసాల్లో పాత్ర?
     ఇతడిని తొలినాళ్లలో బీహార్‌లో యువతను ఐఎంలో రిక్రూట్ చేయడానికి వినియోగించిన యాసీన్... ఆ తరవాత విధ్వంసాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చాడు.
     2010లో వారణాసి, 2011లో ముంబై, 2012లో పుణే, 2013లో హైదరాబాద్, బుద్ధగయల్లో జరిగిన పేలుళ్లలో ఇతడి పాత్ర ఉంది.
     యాసీన్ భత్కల్ విచారణలోనే ఇదే విషయం బయటపడింది.
 ఎక్కడెక్కడ ఎస్కేప్?
     గత ఏడాది ఆగస్టులో యాసీన్ భత్కల్, హడ్డీల్నీ నిఘా వర్గాలు నేపాల్‌లోని పోఖారా ప్రాంతంలో పట్టుకున్నాయి.
     అక్కడి ‘ఐఎం-కంట్రోల్డ్’ బేస్‌కు తరచు వచ్చే మోను ఆ రోజు రాకపోవడంతో తప్పించుకున్నాడు.
     కర్ణాటక రాష్ర్టం మంగుళూరులోని హంపన్‌కట్ట ప్రాంతంలో జఫైర్ హైట్స్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తు 301 ఫ్లాట్‌లో వీరి డెన్ ఉంది.
     యాసీన్ అరెస్టు నేపథ్యంలో ఈ డెన్‌పై పోలీసులు దాడి చేశారు.
     దీనికి కొన్ని గంటల ముందే మోను, మరో ఉగ్రవాది వకాస్ అక్కడి నుంచి జారుకున్నారు.
 రాజస్థాన్‌లో ఏ ముసుగులో?
     జఫైర్ హైట్స్ డెన్ కూడా వెలుగులోకి వచ్చేయడం, వేట ముమ్మరం కావడంతో మోను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
     అనేక సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలించిన నిఘా వర్గాలు మోను రాజస్థాన్‌కు చేరుకున్నట్లు గుర్తించాయి.
     అక్కడున్న పుష్కర్ ప్రాంతంలో టూరిస్ట్ గైడ్ అవతారం ఎత్తాడని తెలుసుకుని గత ఏడాది నవంబర్‌లో వల పన్నాయి.
     ఈ విషయం పసిగట్టిన మోను మరోసారి తప్పించుకున్నాడు. దీంతో నిఘా వర్గాలు తమ వేటను కొనసాగిస్తున్నాయి.
 
 సిటీతో సంబంధమేంటి?
     కిందటేడాది ఫిబ్రవరిలో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్ల కోసం వచ్చిన ఐఎం
     ఉగ్రవాదుల్లో మోను కూడా ఉన్నాడు.
     విద్యార్థుల ముసుగులో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నది ఇతనే.
     కిందటేడాది ఫిబ్రవరి 21 (పేలుళ్లు జరిగిన రోజు) సాయంత్రం మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి రంగంలోకి దిగాడు.  
     పేలుళ్లలో వాడిన సైకిళ్లను మలక్‌పేట్, జుమ్మేరాత్ బజార్లలో ఖరీదు చేశాడు.
     ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్‌ను పార్క్ చేసి వెళ్లిపోయింది మోనునే.
 
 

మరిన్ని వార్తలు