జై..జై జగనన్న

24 May, 2019 15:23 IST|Sakshi
బాలినేని ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు

సాక్షి, ఒంగోలు సిటీ : జై జగనన్న..జైజై జగనన్న నినాదం మార్మోగింది. ఒంగోలులో అభిమానుల కేరింతలు.. కార్యకర్తల ఉత్సాహంతో పండువ వాతావరణం నెలకుంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి విడతలో వైఎస్సార్‌ సీపీకి ఆధిక్యం రావడంతో జోష్‌ నిండింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒంగోలు నగరం బోసి పోయింది. కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారు. టీవీలకు అతుక్కుపోయారు. ఉదయం నుంచి ఫలితాలపై దృష్ఠి సారించారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ఓట్ల లెక్కింపు మొదలయిన దగ్గర నుంచి క్షణక్షణం వస్తున్న ఫలితాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జై జగన్‌ అంటూ కేరింతలు, రెట్టించిన ఉత్సాహంతో వీదుల వెంట యువకులు కన్పించారు. నగరంలో మోటారు బైక్‌లతో యువకులు సందడి చేశారు. యువకులు బుల్లెట్‌ వాహనాలతో వీధుల్లో సందడి చేశారు. జై జగన్‌..వాసన్నకు జిందాబాద్‌ అంటూ యువకులు సందడి చేశారు. స్థానిక మంగమూరు డొంకలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద యువకులు వైఎస్సార్‌ సీపీ విజయోత్సాహంతో గులాములు చల్లుకున్నారు. రోడ్లన్నీ గులాబి రంగు మయమైంది. ఎండలో యువకులు వసంతమాడినట్లుగా ఉంది.  మతాబులతో మోతెక్కించారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా సందడి చేశారు.
ఫ్యాన్‌తో విశ్రాంత ఉద్యోగులు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఫ్యాన్‌ గాలి సునామి నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగులు పట్టరాని సంతోషంతో ఫ్యాన్‌ చేపట్టుకొని జగన్నినాదాలు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి జిందాబాద్‌లు పలికారు. స్ధానిక అభిలాష్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ విభాగం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  షేక్‌ అబ్దుల్‌ బషీర్, వరద వెంకట కృష్ణారావు, కె.ఎల్‌.నరసింహారావు, శెట్టి గోపి, ఎస్‌.కె.జిలాని, ఎస్‌.వెంకటస్వామి, ఇ.వెంకటేశ్వర్లు, వెంకారెడ్డి, సుందరం, మొహిద్దీన్, బి.గిరి, కె.జేసురత్నం, ఎస్‌.కె.జిలాని తదితరులు వైఎస్సార్‌ సీపీ ఘన విజయం వేడుకల్లో పాలుపంచుకున్నారు.
శచీదేవిని కలిసిన మహిళలు
బాలినేని శ్రీనివాసరెడ్డి ఘన విజయంతో పాటు విశేష మెజారిటీ సాధించినందుకు ఆయన సతీమణి బాలినేని శచీదేవిని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా «అధ్యక్షురాలు గంగాడ సుజాత, ఒంగోలు నియోజకవర్గం అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధులు కలిసి అభినందించారు. శచీదేవి వీరికి సాంప్రదాయబద్దంగా కుంకుమబొట్టుతో గౌరవించారు. కావూరి సుశీలతో   మహిళా నాయకుల పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు