జగమంత సంబరం

24 Sep, 2013 02:27 IST|Sakshi

 ఇది ముందే వచ్చిన జన ‘విజయ’ దశమి.. అశేషాంధ్రుల ఆకాంక్ష నెరవేరేలా.. కుత్సితాలను, కుతంత్రాలను  చీల్చుకునిజనప్రియనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు రానున్న రోజు.. జన నేతకు బెయిల్ లభించిందన్న ‘బ్రేకింగ్ న్యూస్’ సోమవారం సాయంత్రం వెలువడిన వెంటనే అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా వెలుగులతో ఆకాశం నిండిపోయింది.

వాడవాడలా జై జగన్ అన్న నినాదం మార్మోగింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే కాకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు.. అన్ని వర్గాల ప్రజలు స్వీట్లతో నోరు తీపిచేసుకున్నారు. తమ అభిమాన నేత ఇన్ని రోజులకు జనంలోకి రానున్నారన్న సంతోషంతో పలువురు జగన్ ప్లకార్డులు, వైఎస్సార్ సీపీ పతాకాలు చేతబూని వీధివీధినా కలియతిరుగుతూ ఉత్సాహభరితంగా ర్యాలీలు నిర్వహించారు.

విభజన వేడితో అగ్నిగుండంలా మారిన జిల్లాకు వైఎస్సార్‌సీపీ అధినేత బెయిల్ వార్త వాసంత సమీరమైంది. ఆంధ్రులనందరినీ ఒక్కటిగా నిలిపే బాధ్యతను భుజాలకెత్తుకునే ఒకే ఒక్కడు జగనన్నే అన్న నిశ్చితాభిప్రాయం ఎల్లెడలా వ్యక్తమయింది.
 

>
మరిన్ని వార్తలు