వరాలు పారేనా..జలాలు పొంగేనా!

13 May, 2015 03:31 IST|Sakshi

రాళ్ల సీమలో రతనాలు పండించాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల. రెండు టీఎంసీల సామర్థ్యం కలిగిన అవుకు రిజర్వాయర్‌ను రూ.70 కోట్లతో 4 టీఎంసీలకు పెంచేందుకు జలయజ్ఞం చేపట్టారాయన. కర్నూలు, కడప జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు.. జీఎన్‌ఎస్‌ఎస్ వరద కాల్వ ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు.. 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించే ఉద్దేశంతో రూ.790 కోట్లు కేటాయించారు.

2010 నాటికి ఒక సొరంగం ద్వారా వైఎస్‌ఆర్ జిల్లా గండికోటకు నీటిని అందించాల్సి ఉంది. వైఎస్‌ఆర్ అకాల మరణం.. ఆ తర్వాత ప్రభుత్వాన్ని కొనసాగించిన కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇక టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పనుల్లో పురోగతి లోపించింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా అవుకు మండలంలో పర్యటించనుండటంతో అనుకూలమైన ప్రకటన చేస్తారనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది.        - కోవెలకుంట్ల
 
►  30వ ప్యాకేజీ కింద సొరంగ నిర్మాణానికి సంబంధించి రూ.332.89 కోట్ల పనులు పూర్తి కాగా.. మరో రూ.69 కోట్లు కేటాయించాల్సి ఉంది.
►  వంద మీటర్ల మేర ఆడిట్, ఎగ్జిట్ ప్రాంతాల్లో లైనింగ్ పనులు చేపట్టాలి.
►  ఎంట్రెన్స్ నుంచి ఆడిట్ ప్రాంతంలో కొంత భాగం సొరంగ పనులతో పాటు లైనింగ్ పూర్తి చేయాలి.
►  ఏడాది క్రితం ఎర్రమల కొండల్లో కురిసిన భారీ వర్షాలతో టన్నెల్‌లోకి వర్షపు నీరు చేరి బ్రేక్ పడిన పనులను పునరుద్ధరించాలి.
►  29వ ప్యాకేజీ కింద వరద కాల్వ నిర్మాణం పూర్తయినా అటవీ శాఖ అనుమతి రాకపోవడంతో పెండింగ్‌లో అరకిలోమీటరు పనులు.
► 47వ ప్యాకేజీ కింద జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వ నిర్మాణం పూర్తయినా.. కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల స్ట్రక్చర్ల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

మరిన్ని వార్తలు