కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

5 Mar, 2016 03:41 IST|Sakshi
కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

సొంత అన్న హత్య కేసులో హతుడు ప్రధాన నిందితుడు
ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లులో ఘటన..

 
ముండ్లమూరు : మండలంలోని పెద్ద ఉల్లగల్లులో శుక్రవారం ముప్పా మోహన్(28) అనే యువకుడు తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన మోహన్ కొంతకాలంగా విజయవాడలో మేనమామ మాదాల శ్రీను వద్ద జీవనం సాగిస్తున్నాడు. డబ్బులు ఇస్తానని తండ్రి రామస్వామి కబురు చేయడంతో గురువారం సాయంత్రం స్వగ్రామం వచ్చాడు. ఆ రోజు రాత్రి మరో మేనమామ పుల్లయ్య ఇంట్లో పడుకుని మరుసటి రోజు తండ్రి వద్దకు డబ్బుల కోసం వెళ్లాడు. ఆ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే అంతు చూస్తానని తండ్రిని మోహన్ హెచ్చరించాడు. వరుసుక తమ్ముడు కొడుకైన హనుమంతురావుతో కలిసి రామస్వామి.. మోహన్‌ను కర్రతో చితకబాదాడు.

మోహన్ పెద్దగా కేకలు వేయడంతో విజయవాడ నుంచి తనతో పాటు వచ్చిన మేనమామ మాదాల శ్రీను సంఘటన స్థలానికి పరుగులు తీశాడు. తీవ్ర గాయూలతో ఉన్న కుమారుడిని తండ్రి అక్కడే వదిలేసి హనుమంతురావుతో కలిసి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. అప్పటికే మోహన్ తీవ్ర గాయాలపై మృతి చెందాడు. సమాచారం అందుకున్న దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు, సీఐ కె.రాఘవేంద్ర, ఎస్సై పి.బాలరంగయ్యలు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. హతుని మేనమామ శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 కొంపముంచిన ఆస్తి
 కొన్నేళ్లుగా తండ్రీకొడుకుల మధ్య ఆస్తి వివాదాలున్నారుు. జల్సాలకు అలవాటు పడి డబ్బు కాజేస్తున్నాడన్న కోపంతో సొంత అన్న శ్రీనును మోహన్ 2012 మేలో హత్య చే శాడు. ఆ ఘటనలో మోహన్‌పై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మోహన్ విజయవాడలో తలదాచుకుంటూ వివాహం చేసుకున్నాడు. గతేడాది తండ్రి భూమిని అమ్మగా కొంత నగదు వచ్చింది. తనకు డబ్బులు కావాలంటూ తండ్రిని పదేపదే అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇస్తాను రమ్మంటూ కుమారునికి కబురు చేశాడు. డబ్బులు తీసుకునే క్రమంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి చివరకు కుమారుని హత్యకు దారి తీసింది.

మరిన్ని వార్తలు