‘ప్రేమ’కు మరో ప్రాణం బలి

31 Aug, 2013 00:40 IST|Sakshi

 నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్: కూతురి మృతిని తట్టుకోలేక తండ్రి గుండె ఆగిన సంఘటన మండలంలోని తిర్మలాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుంటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబటి నారాయణరెడ్డి(70) తన కూతురు మంగమ్మ మృతి, అల్లుడు నర్సింహారెడ్డి పరిస్థితిని తట్టుకోలేక ఒక్కసారిగా కూప్పకూలినట్టు బంధువులు తెలిపారు.
 తుప్రాన్ మండలం యావపూర్‌కు చెందిన మంగమ్మ, నర్సింహారెడ్డి దంపతులు తమ కూతురు ప్రేమ విషయాన్ని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం విదితమే.
 
  ఈ సంఘటనలో మంగమ్మ మృతి చెందగా నర్సింహారెడ్డి ప్రాణాపాయస్థితిలో కొంపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న నారాయణరెడ్డి అదే రోజు తన కుటుంబ సభ్యులతో కలసి యావపూర్ వెళ్లారు. కూతు రు మంగమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే   చికిత్స పొందుతున్న అల్లుడు నర్సింహారెడ్డి పరిస్థితిని చూసి తీవ్రంగా కలత చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా నారాయణరెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. ఒక్కగానొక్క కూతురు కావడంతో మంగమ్మను చిన్నప్పటినుంచి నారాయణరెడ్డి గారాబంగా చూసుకునేవారని బంధువులు చెప్పారు. మంగమ్మకు సైతం ఒక్కగానొక్క కూతురు మాలశ్రీ. దీంతో మనవరాలిని సైతం చాలా ప్రేమగా చూసుకునే వారని తెలిపారు. మృతునికి భార్య సత్తమ్మ, కుమారులు గోపాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, రాంరెడ్డి ఉన్నారు.
 
 మెరుగుపడిన నర్సింహారెడ్డి ఆరోగ్యం...
 తూప్రాన్: ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహారెడ్డి ఆరోగ్యం కాస్త మేరుగుపడినట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిచ్చార్జి చేయనున్నట్లు సమాచారం. అయితే కూతురు ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ స్థానిక ఎస్‌ఐ.నిరంజన్‌రెడ్డిని సంప్రదించగా కూతురు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. బంధువులు, గ్రామస్థులు మాత్రం స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
 5
 

మరిన్ని వార్తలు