కన్న కొడుకునే కిడ్నాప్ చేసాడు

10 May, 2014 14:24 IST|Sakshi

గుంటూరు : మద్యం తాగేందుకు డబ్బు కోసం కన్నకొడుకునే తండ్రి కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పీఎస్ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన గోళ్ల శ్రీనివాసరావుకు తాడేపల్లికి చెందిన మహాలక్ష్మితో 2006లో వివాహమైంది. భార్యభర్తలిద్దరూ కూలి పనిచేసి జీవిస్తున్నారు.

 

భార్య సందపాదన కుటుంబ పోషణకు ఖర్చు పెడుతుంటే భర్త తన సంపాదనను తాగుడుకు ఖర్చు చేస్తున్నాడు. విషయం పెద్దల దాకా వెళ్లి పంచాయితీలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. ఈలోగా వారికి ఓ కుమారుడు పుట్టాడు. ప్రతిసారి భార్య పంచాయితీ పెడుతోందన్న కోపంతో శ్రీనివాసరావు మహాలక్ష్మిని వదిలేసి, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

తాగుబోతు మొగుడు పోతేపోయాడనుకుని మహాలక్ష్మి కుమారుడితో సహా పుట్టింటికి వచ్చి కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న ఓటేసేందుకు తాడేపల్లి వచ్చిన శ్రీనివాసరావు  మహాలక్ష్మి ఇంటికి వచ్చి పిల్లోడితో ఆడుకుంటున్నట్లు నటించి చాకెట్లు కొనిపెడతానంటూ తీసుకుపోయాడు. ఎంతసేపటికీ వారిద్దరూ రాకపోవటంతో అనుమానం వచ్చిన  మహాలక్ష్మి అత్తంటికి వెళ్లి బిడ్డ కోసం ఆరా తీసింది. అయినా ఫలితం లేకపోవటంతో పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు