కన్న తండ్రే కిరాతకుడు

9 Dec, 2018 11:00 IST|Sakshi

మూడేళ్ల బిడ్డ గొంతు నులిమిన తండ్రి

ఆపై కర్కశంగా గొంతుకోసి హత్య 

వాడు నీ బిడ్డ కాదన్నందుకు దారుణం 

2011లో నిందితుడిపై రేప్‌ కేసు నమోదు

కిడ్నాప్‌ కేసు హత్య కేసుగా మార్పు

వాడు నీ బిడ్డ కాదు.. నీకు పుట్టలేదు.. భార్య అన్న ఈ మాటలకు అతడిలోని కిరాతకుడు మేల్కొన్నాడు. బిడ్డ కాని వాడ్ని బతకనీయకూడదు అనుకున్నాడు. కుర్‌కురే ప్యాకెట్‌ కొనిపెడతానంటూ ఆశపెట్టి ఇంటి నుంచి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. కన్నబిడ్డ అనే కనికరం లేకుండా మూడేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. ఇంకా బతికే ఉన్నాడేమో అనే అనుమానంతో కర్కశంగా కత్తితో గొంతు కోసి రాళ్ల గుట్టల మధ్య పడేశాడు. ఏమీ తెలియనట్లు ఇంటికొచ్చి, బిడ్డను అప్పుడే ఇంటి వద్ద వదిలిపెట్టానని బుకాయించాడు. అనుమానించిన భార్య ఫిర్యాదుతో కిడ్నాప్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నిజాన్ని కక్కించారు.

చీమకుర్తి మండలం యల్లయ్యనగర్‌ వద్ద నవంబర్‌ 30వ తేదీన జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. శనివారం చీమకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఒంగోలు రూరల్‌ సీఐ ఓ.దుర్గాప్రసాద్‌ నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. చీమకుర్తి: నెల్లూరు జిల్లా ఏఎస్‌ పేటకు చెందిన షేక్‌ ఖాదర్‌వలి, సల్మా దంపతులకు మూడేళ్ల కుమారుడు సాహుల్‌ ఉన్నాడు. ఖారద్‌వలి బేల్దారి పని చేస్తుంటాడు. బంధువుల గ్రామం చీమకుర్తి మండలం యల్లయ్యనగర్‌లో బేల్దారి పనులు చూస్తూ గతంలో కొన్నాళ్లు భార్య బిడ్డతో ఇక్కడే నివాసం ఉన్నాడు. ఆ తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి.

ఈ క్రమంలో నవంబర్‌ 29న యల్లయ్యనగర్‌లోని బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్‌కు హాజయ్యేందుకు వచ్చారు. ఫంక్షన్‌ పూర్తయ్యాక యల్లయ్యనగర్‌లోనే బేల్దార్‌ పనులు నిమిత్తం ఖాదర్‌వలి ఉండాలనుకున్నాడు. కానీ   సల్మా మాత్రం నెల్లూరు వెళ్లాలనే ఉద్దేశంతో 30వ తేదీన తన సోదరులను పిలిపించుకుంది. ఇది గమనించిన ఖాదర్‌వలి భార్య, కొడుకు నెల్లూరు వెళ్లిపోతారేమో అని భావించి, కొడుకును దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో భార్య సల్మా జోక్యం చేసుకుంటూ దగ్గకు తీసుకోనీయకుండా అడ్డుపడింది.

అంతే కాకుండా వాడు నీబిడ్డ కాదు, నీకు పుట్టలేదంటూ మాట్లాడింది. భార్య  మాటలకు ఖాదర్‌వలి కలత చెందాడు. 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సాహుల్‌ను కుర్‌కురే ప్యాకెట్‌ కొని పెడతానంటూ కొట్టు వద్దకు తీసుకెళ్లాడు. ఎర్రకొండ సమీపంలో జన సంచారం లేని కొండ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్యచేశాడు. అయినా ప్రాణాలతో ఉంటాడేమోనని అనుమానంతో వెంట తీసుకెళ్లిన కత్తితో గొంతు కోసి పక్కనున్న రాళ్లమధ్యలో పడేశాడు. ఏమీ తెలియనట్లుగా సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇంటివద్దకు వచ్చాడు. కుర్‌కురే ప్యాకెట్‌ కొనిపెట్టి సాహుల్‌ను అప్పుడే ఇంటి వద్ద వదిలి పెట్టానని ఖాదర్‌వలి బుకాయించాడు. పిల్లాడు ఎక్కడికి పోయి ఉంటాడోనని ఆందోళనతో కుటుంబసభ్యులు బిడ్డ కనిపించటం లేదని అదేరోజు చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సల్మా ఫిర్యాదు మేరకు 30న పోలీసులు కిడ్నాప్‌ కేసుగా నమోదు చేశారు. భర్త మీదే అనుమానం అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఖాదర్‌వలి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం చీమకుర్తిలోని తూర్పు బైపాస్‌ వద్ద పోలీసులు వాహనాలు చెక్‌ చేస్తుండగా ఆర్టీసీ బస్సు నుంచి దిగిన ఖాదర్‌వలి పోలీసులను చూసి హడావుడిగా పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించి, నిందితుడిని వెంటాడి పట్టుకున్నట్లుగా సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. అదుపులోకి తీసుకొని విచారించగా తన కొడుకును ఎలా హత్య చేశాడో వివరించినట్లు సీఐ తెలిపారు. 2011లో యల్లయ్యనగర్‌లో జరిగిన ఒక అత్యాచారయత్నం కేసులో కూడా ఖాదర్‌వలిపై కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఆ కేసును 2013లో కోర్టు కొట్టి వేసిందని, ఖాదర్‌వలి కొడుకును హత్య చేసినందున కిడ్నాప్‌ కేసును హత్యకేసుగా మార్పు చేసినట్లు సీఐ తెలి పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. 
 

మరిన్ని వార్తలు