ఫాతిమా విద్యార్థుల సమస్య ప్రభుత్వానిది కాదు: మంత్రి

23 Dec, 2017 04:11 IST|Sakshi

బి.కొత్తకోట: ఫాతిమా వైద్య విద్యార్థుల సమస్య ప్రభుత్వానిది కాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఆ విద్యార్థులకు న్యాయం జరగడం కష్టమేనని, అయినప్పటికీ మరోమారు దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విన్నవించడం జరిగిందన్నారు.

విద్యార్థులు నష్టపోకుండా వారికి నీట్‌లో నారాయణ విద్యాసంస్థలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, కళాశాల యాజమాన్యం నుంచి విద్యార్థులు చెల్లించిన డొనేషన్లను తిరిగి ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రమంత్రి గడ్కరీ భరోసా ఇచ్చారని, ఈనెల 26న ఆయన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలూ చర్చిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు