వేషం కట్టి.. జోలె పట్టి..

28 Jan, 2020 13:37 IST|Sakshi
జాతరలో భిక్షాటన చేస్తున్న భక్తుడు

విభిన్న వేషధారణలతో ఆకట్టుకున్న కొప్పవరం గ్రామస్తులు

ఘనంగా ముగిసిన సత్తెమ్మతల్లి జాతర

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం

అనపర్తి: చిన్నా, పెద్దా అనే తారతమ్యం లేదు.. పేద, ధనిక అనే భేదం లేదు.. అందరూ విచిత్రవేషధారణలతో ఆకట్టుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారికి మొక్కుబడిగా వీధుల్లో భిక్షాటన చేశారు. అలా వచ్చిన సొమ్మును అమ్మవారికి సమర్పించారు. కోట్లకు పడగలెత్తిన కుబేరుల నుంచి దినసరి కూలీల వరకు అందరూ సత్తెమ్మతల్లి జాతరలో ఆనందంగా పాల్గొనడం అక్కడ విశేషం.అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే ఈ సత్తెమ్మతల్లి జాతర సోమవారంతో ముగిసింది.రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా తరలివచ్చిన భక్తులతో కొప్పవరం వీధులన్నీ జనసంద్రమయ్యాయి. అమ్మవారి అనుగ్రహం కోసం బెత్తం దెబ్బలు తింటూ.. ఆ తల్లిని స్మరిస్తూ తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవాలు, సంబరాల గొప్పదనాన్ని, జాతర విశిష్టతను చాటారు.

అచంచలమైన భక్తి విశ్వాసం :కొప్పవరం గ్రామానికి చెందిన కర్రి వంశీకుల కులదేవతగా పూజలందుకుంటున్న సత్తెమ్మ తల్లిని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు. ముఖ్యంగా సంతానం కోసం అమ్మవారిని దర్శించిన భక్తులు రెండేళ్ల తరువాత వచ్చే సంబరానికి బిడ్డతో అమ్మవారి దర్శనానికి వస్తారు. ఈనెల 25న అమ్మవారి సన్నిధిలో ఉంచిన కత్తి కుండను కిందకు దింపడంతో ప్రారంభమైన జాతర సోమవారంతో ఘనంగా ముగిసింది. ఈ జాతరలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకుడు, కేవీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ అధినేత కాయల వెంకటరెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మేడపాటి షర్మిలారెడ్డి, జిల్లా కార్యదర్శి ఒంటిమి సూర్యప్రకాష్, పార్టీ మండల కన్వీనర్‌ మల్లిడి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి తోట నరసింహం సతీమణి తోట వాణి, కాకినాడకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అసోసియేషన్‌ అ«ధ్యక్షుడు కర్రి త్రినాథరెడ్డి, కాకినాడ, రాజమహేంద్రవరం టౌన్‌ రెడ్డి సంఘం అధ్యక్షడు కర్రి అచ్యుతరామారెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు