-

పుట్టపర్తిలో రచ్చకెక్కుతున్న సత్యసాయి ట్రస్ట్‌

15 Jul, 2013 15:47 IST|Sakshi
వివాదాలకు నిలయంగా మారుతున్న పుట్టపర్తి

పుట్టపర్తి : ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి వరుస వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. సత్యసాయి జీవించి ఉన్నంతకాలం స్తబ్దుగా ఉన్న ట్రస్ట్‌ వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి. సత్యసాయి తమ్ముడి కొడుకు రత్నాకర్‌, మేనల్లుడు గణపతి రాజు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఈ క్రమంలోనే గణపతిరాజుపై పుట్టపర్తి పోలీస్‌స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. రత్నాకర్‌ మద్దతుదారుడు చింతమాను సాయిప్రసాద్‌... గణపతిరాజు తనను దూషిస్తూ దాడిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుమేరకు గణపతిరాజుపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. తనపై హత్యాయత్నం చేశాడంటూ గణపతిరాజు సైతం సాయిప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

మరోవైపు సత్యసాయి బంధువు గణపతిరాజుకు వ్యతిరేకంగా పుట్టపర్తిలో ఆందోళనలు మిన్నంటాయి. సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్‌పై గణపతిరాజు కావాలనే ఆరోపణలు చేస్తున్నారంటూ స్థానిక సాయినగర్‌ వాసులు రోడ్డెక్కారు. దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్న గణపతిరాజుపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు