సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు

14 Aug, 2019 03:47 IST|Sakshi

1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రెండు పూటలా వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా నిర్వహణ

షెడ్యూల్‌ను విడుదల 

సాక్షి, అమరావతి : కనీవినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1,26,728 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను సెప్టెంబర్‌ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ వెల్లడించారు. 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేర్వేరు ఉద్యోగాలకు విడివిడిగా రాతపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌లు మంగళవారం ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి రాతపరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,26,728 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేయగా.. 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి మొత్తం 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తుండగా.. 10 రాత పరీక్షలకు తెలుగు, ఇంగ్లీష్‌ ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈనెల 22 నుంచి హాల్‌ టికెట్లను అన్‌లైన్‌లో ఉంచుతున్నామని, అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

మరిన్ని వార్తలు