హమ్మయ్య.. ఎగిరింది...!

26 Dec, 2013 02:48 IST|Sakshi

   సాంకేతిక లోపంతో ఇల్లెందులో దిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్
     వారం రోజులపాటు సిబ్బంది నిరీక్షణ
     మరమ్మతులు పూర్తవడంతో గమ్యానికి పయనం
 
 ఇల్లెందు, న్యూస్‌లైన్
 ‘హమ్మయ్య... ఎగిరింది..’- ఇల్లెందులో వారం రోజుల నిరీక్షణ తరువాత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిలో వ్యక్తమైన అనుభూతి ఇది. ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన హెలికాప్టర్ (జె.4064) ఈ నెల 19న ఉదయం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిని ఇల్లెందులోని సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో పైలట్ సురక్షితంగా దింపారు. మరమ్మతుల కోసం బెంగుళూరు నుంచి మరుసటి రోజున సాంకేతిక సిబ్బంది వచ్చి  పనులు మొదలుపెట్టారు. ఇవి బుధవారం పూర్తయ్యాయి.
 
 బుధవారం ఉదయం 11:20 గంటల సమయంలో గాలి లోకి ఎగిరింది. కొద్దిసేపు ట్రయల్ చేసి, అంతా బాగుందని నిర్థారించుకున్నాక గమ్యస్థానానికి పంపించారు. దీంతో, ఎయిర్‌ఫోర్స్ అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లెందులో నిలిచిన ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు, పరిసర గ్రామాల వాసులు ఈ వారం రోజులపాటు జాతరకు వచ్చినట్టుగా తరలివచ్చారు. వీరి తాకిడి ఎక్కువవడంతో గ్రౌండ్ ముఖద్వారం గేట్లను పోలీసులు మూసివేశారు.

మరిన్ని వార్తలు