పెదమామిడిపల్లిలో అగ్ని ప్రమాదం

21 Nov, 2018 08:51 IST|Sakshi
అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన ఇళ్లు

మూడు తాటాకిళ్లు దగ్ధం..

రూ.4 లక్షల ఆస్తి నష్టం

పాలకొల్లు అర్బన్‌: మండలంలోని పెదమామిడిపల్లి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద   మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదంలో మూడు తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు నిరాశ్రయులు కాగా, రూ.4 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో శీలం సాయిబాబు, పరువు నాగరాజు, పరువు ప్రసాదరావు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ మూడు కుటుంబాలకు చెందిన గృహ సామగ్రి, విలువైన డాక్యుమెంట్లు కాలిబూడిదయ్యాయి.

కష్టార్జితం బుగ్గిపాలు
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పరువు ప్రసాదరావు కుమార్తె సువర్ణ సోమవారం గల్ఫ్‌ దేశం స్వస్థలానికి వచ్చింది.  కుమార్తె వచ్చిందన్న సంతోషంలో కుటుంబ సభ్యులున్నారు. అగ్నిప్రమాదంలో కుమార్తె తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ పూర్తిగా కాలిపోయింది. ఈ బ్యాగ్‌లో సుమారు రూ.2 లక్షల నగదు, బంగారం, పాస్‌పోర్టు ఉన్నాయి. అవి మొత్తం కాలి బూడిదవ్వడంలో కష్టార్జితం బుగ్గిపాలైందని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. అలాగే శీలం సాయిబాబుకి చెందిన నాలుగు కాసుల బంగారు, రూ.32వేలు నగదు కాలిపోయింది. తహసీల్దార్‌ దాసి రాజు ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు